ముంబై, జనవరి 21: రూ.8,400 కోట్ల విలువైన బాండ్లను రైటాఫ్ చేస్తూ గతంలో యెస్ బ్యాంక్ తరపున ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం చెల్లదంటూ తాజాగా బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ బాండ్లను కొనుగోలు చేసిన రిటైల్ ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్స్ దాఖలు చేసిన వివిధ పిటిషన్లపై విచారించిన అనంతరం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. బ్యాంక్ ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునేందుకు ఆరు వారాలు గడువు ఇచ్చింది. లేదా రైటాఫ్ చేసిన తేదీ నుంచి 9 శాతం వార్షిక వడ్డీతో బాండ్ల మొత్తాన్ని ఇన్వెస్టర్లకు చెల్లించాలని యస్బ్యాంక్ను ఆదేశించింది. యెస్ బ్యాంక్ను ప్రమోట్ చేసిన రాణా కుపూర్ కుటుంబం బ్యాంక్ నిధుల్ని తరలించిన నేపథ్యంలో రిజర్వ్బ్యాంక్ 2020 మార్చిలో బ్యాంక్పై మారటోరియం విధించింది. అటుతర్వాత యెస్ బ్యాంక్ పునరుద్ధరణలో భాగంగా ఆర్బీఐ నియమించిన కొత్త డైరెక్టర్ల బోర్డు అంతక్రితం జారీఅయిన బాండ్లను రైటాఫ్ చేయాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను ఆర్బీఐ ఆమోదించింది. ఆపై యస్ బ్యాంక్ను ఎస్బీఐ టేకోవర్ చేసింది.
2016, 2017 సంవత్సరాల్లో రెండు దఫాలుగా జారీచేసిన అడిషనల్ టైర్ 1 (ఏటీ-1) బాండ్లను వివిధ మ్యూచువల్ ఫండ్స్, ఆర్థిక సంస్థలతో పాటు రిటైల్ ఇన్వెస్టర్లకు యెస్ బ్యాంక్ విక్రయించింది. బ్యాంక్లు వాటి మూలధనాన్ని విస్తరించుకోవడానికి ఈక్విటీ తరహాలోనే ఈ రుణ పత్రాల్ని (బాండ్లు) జారీచేస్తుంటాయి. ఈ బాండ్లకు కాలపరిమితి ఏదీ ఉండదు. బ్యాంక్లే తిరిగి వాటిని ఇన్వెస్టర్ల నుంచి కొనుగోలు చేసే కాల్ ఆప్షన్ ఉంటుంది. అయితే బ్యాంక్ ఆర్థిక పరిస్థితి దిగజారితే ఈక్విటీలానే ఏటీ-1 బాండ్లలో సాధారణ బాండ్లకంటే రిస్క్ ఎక్కువ. ఇవి సెక్యూర్డ్ బాండ్లు కాదు. అందుకే వీటిపై ఇతర బాండ్లకంటే వడ్డీ కాస్త ఎక్కువ. వీటిని ఫండ్స్కే బ్యాంక్లు విక్రయిస్తుంటాయి. రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడి చేయడానికి అవకాశం ఉండదు. కానీ ఏటీఐ బాండ్లను యెస్ బ్యాంక్ సంస్థాగత ఇన్వెస్టర్ల ద్వారా వ్యక్తిగత ఇన్వెస్టర్లకు విక్రయించినట్టు మార్కెట్ నియంత్రణా సంస్థ సెబీ దర్యాప్తులో తేలింది. ఈ బాండ్లలో ఉన్న రిస్క్లను తెలియచెప్పకుండా వీటిని ‘సూపర్ ఎఫ్డీ’, ‘ఫిక్స్డ్ డిపాజిట్లానే సురక్షితం’ అని ప్రచారం చేసి ఇన్వెస్టర్లకు యెస్ బ్యాంక్ జారీచేసినట్టు సెబీ కనుగొంది. ఈ బాండ్లపై 9-9.5 శాతం వడ్డీ రాబడిని ఆఫర్ చేస్తూ రిటైలర్లకు యెస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్లు విక్రయించారు.
బాండ్ల రైటాఫ్పై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేస్తామని శనివారం యెస్ బ్యాంక్ ప్రకటించింది.
మొండి బకాయిలకు భారీ కేటాయింపులు జరపడంతో 2022 డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికరలాభం 79 శాతం క్షీణించి రూ. 55.07 కోట్లకు తగ్గింది. నికర వడ్డీ ఆదాయం 11.7 శాతం వృద్ధితో రూ.1,971 కోట్లకు చేరింది. వడ్డీయేతర ఆదాయం 56 శాతం పెరిగి రూ.1,143 కోట్ల వద్ద నిలిచింది. ఎన్పీఏలకు కేటాయింపులు రూ.375 కోట్ల నుంచి భారీగా రూ.845 కోట్లకు చేరుకున్నాయి. తమ మొండి బాకాయిల్లో చాలావరకూ జేసీ ఫ్లవర్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి బదిలీ చేయడంతో స్థూల ఎన్పీఏలు 13 శాతం నుంచి 2 శాతానికి తగ్గినట్టు యస్ బ్యాంక్ సీఈవో ప్రశాంత్ కుమార్ చెప్పారు.