న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: యెస్ బ్యాంక్ ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.367 కోట్ల లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో బ్యాంక్ రూ.3,788 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. మొండి బకాయిలకోసం నిధుల కేటాయింపులు తగ్గుముఖం పట్టడం, నికర వడ్డీ ఆదాయం పెరగడంతో లాభాల్లోకి రావడానికి దోహదపడ్డాయని తెలిపింది. అలాగే డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన రూ.266 కోట్లతో పోలిస్తే 38 శాతం అధికమైంది. 2021-22 ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.1,066 కోట్ల లాభాన్ని ఆర్జించింది. సమీక్షకాలంలో బ్యాంక్ ఎన్ఐఐ 84.4 శాతం పెరిగి రూ. 1,819 కోట్లకు చేరుకున్నాయి. నికర వడ్డీ మార్జిన్ 2.5 శాతం చొప్పున పెరిగినట్లు బ్యాంక్ బీఎస్ఈకి సమాచారం అందించింది. ప్రస్తుతం బ్యాంక్ రూ.1,97 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 21 శాతం చొప్పున పెరిగాయి.
2020-21 ఏడాది నాలుగో త్రైమాసికంలో రూ.4,678.59 కోట్లుగా ఉన్న ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.5,829.22 కోట్లకు పెరిగాయి.
బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 14.7 శాతం నుంచి 13.9 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏ కూడా 5.3 శాతం నుంచి 4.5 శాతానికి తగ్గాయి.
కొత్తగా గత త్రైమాసికంలో రూ.5,795 కోట్ల రుణాలు మొండి బకాయిల జాబితాలోకి చేరాయి.
గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి బ్యాంక్ ఆదాయం రూ.23,053 కోట్ల నుంచి రూ. 22,285.98 కోట్లకు తగ్గాయి.