న్యూఢిల్లీ : బంగారం, వెండి ధరలు మళ్లీ కొండెక్కాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల పెరుగుదలతో దేశీ మార్కెట్ లోనూ బంగారం, వెండి ధరలు భారమయ్యాయి. ఎంసీఎక్స్ లో మంగళవారం పదిగ్రాముల బంగారం రూ 49,121కు చేరి రూ 50,000 దిశగా పరుగులు పెడుతోంది. ఇక కిలో వెండి దాదాపు రూ 1000 భారమై కిలోకు రూ 72,746 పలికింది. మరోవైపు గ్లోబల్ మార్కెట్ లో గోల్డ్ ధర ఐదు నెలల గరిష్టస్థాయికి చేరింది.
డాలర్ బలహీనపడటం, కరోనా మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థ రికవరీ ఆశలతో స్పాట్ గోల్డ్ ధరలు 0.5 శాతం ఎగిశాయి. ఔన్స్ బంగారం 1916 డాలర్లు పలుకుతుండగా ఇది 1922 డాలర్లు దాటితే ఇక పసిడి దూకుడు అడ్డుకట్ట వేయలేమని బులియన్ ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. భారత్, చైనా ఇన్వెస్టర్ల నుంచి తిరిగి బంగారానికి డిమాండ్ పెరుగుతుండటంతో కూడా గోల్డ్ ధరలు పరుగులు పెడుతున్నాయని చెబుతున్నారు.