న్యూఢిల్లీ, జూన్ 8: వచ్చే కొద్దినెలల్లో ఆర్థిక మాంద్యం వచ్చే ప్రమాదం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న వాణిజ్యవేత్తలు, ఇన్వెస్టర్లు, బ్యాంకర్ల సరసన తాజాగా ప్రపంచబ్యాంక్ చేరింది. ఈ సంవత్సరాంతానికి అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి నెమ్మదిస్తుందని, అటుతర్వాత కొన్ని దేశాలు తీవ్ర మాంద్యంలో చిక్కుకుంటాయని ప్రపంచ బ్యాంక్ హెచ్చరించింది. ఈ అంతర్జాతీయ సంస్థ విడుదల చేసిన నివేదికలో ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మల్పాస్ రాసిన ముందుమాటలో ‘పలు దేశాలు మాంద్యం బారినపడకండా తప్పించుకోలేవు’ అంటూ తీవ్ర సంకేతమిచ్చారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధి అంచనాల్ని ప్రపంచ బ్యాంక్ భారీగా కుదించింది. 2021లో 5.7 శాతంగా ఉన్న వృద్ధి రేటు ప్రస్తుత ఏడాది 2.9 శాతానికి దిగిపోతుందన్నది. 2022 జనవరిలో ప్రకటించిన 4.1 శాతం అంచనాలకంటే ఇది బాగా తక్కువ. కొవిడ్ వేవ్స్తో అంతర్జాతీయంగా సరఫరా అవరోధాలు ఏర్పడటం, వర్థమాన దేశాల్లో ఆదాయ వృద్ధి, పేదరిక నిర్మూలనా చర్యల్లో విఘాతం కలగడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2022 ప్రారంభంలోనే వృద్ధి అంచనాల్ని తగ్గించింది.
అటుతర్వాత ఉక్రెయిన్ యుద్ధం మొదలుకావడంతో ఇంధన, ఆహారోత్పత్తుల ధరలు పెరగడం, అంతర్జాతీయ వాణిజ్యానికి అవాంతరాలు ఏర్పడిన నేపథ్యంలో వృద్ధి అంచనాలకు మరింత కోత పడింది. ‘ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తీవ్ర మాంద్యానికి కేవలం రెండేండ్ల కొవిడ్-19 కారణమవుతున్నది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మళ్లీ డేంజర్లో పడింది’ అని మల్పాస్ వ్యాఖ్యానించారు.
ఉక్రెయిన్పై రష్యా దాడి, ద్రవ్యోల్బణం పెరుగుదలతో అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపునకు తెరతీసింది. ఈ రేట్లు మరింత పెరిగితే మొదటికే మోసం వస్తుందని ఇప్పటికే పలువురు ఆర్థిక వేత్తలు ఒకవైపు హెచ్చరిస్తూనే మరోవైపు పెంపు తప్పదని చెపుతున్నారు. ఇలా రేట్లు పెరుగుతూపోతే ఆర్థిక వ్యవస్థ కుంచించుకుపోయి, మాంద్యంలోకి జారుకుంటుంది. 2008లో ఆర్థిక సంక్షోభం కారణంగా జరిగిన మార్కెట్ పతనాల్ని ప్రస్తుత ‘మాంద్యం’ హెచ్చరికలు గుర్తుచేస్తున్నాయి. అయితే అంతటిస్థాయలో ఇప్పుడు పతనం సంభవించకపోవొచ్చని, మాంద్యం తీవ్రంగా ఉండబోదని పలువురు ఆర్థిక విశ్లేషకులు స్వాంతన వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ చిన్నపాటి మాంద్యం సైతం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని ప్రపంచ బ్యాంక్ హెచ్చరిస్తున్నది.
వర్థమాన దేశాల ఆర్థిక వ్యవస్థల్ని అతలాకుతలం చేసే ‘స్టాగ్ఫ్లేషన్’ను ప్రపంచ బ్యాంక్ నివేదికలో మాల్పాస్ పలుమార్లు ప్రస్తావించారు. ఒకవైపు వృద్ధి కనిష్ఠస్థాయికి పడిపోవడం, మరోవైపు ధరలు గరిష్ఠస్థాయికి పెరగడాన్ని స్టాగ్ఫ్లేషన్గా వ్యవహరిస్తారు. ‘కొద్ది సంవత్సరాలపాటు సగటు కంటే అధిక ద్రవ్యోల్బణం, సగటుకంటే తక్కువ వృద్ధి కొనసాగవచ్చు.
ఈ పరిణామం అల్ప, మధ్యాదాయ ఆర్థిక వ్యవస్థలకు ముప్పుగా పరిణమిస్తుంది. అదే..1970 దశకం తర్వాత ఇప్పటివరకూ ప్రపంచం చూడని స్టాగ్ఫ్లేషన్’ అని హెచ్చరించారు. అలాగే గతంలో స్టాగ్ఫ్లేషన్ వచ్చినపుడు ద్రవ్య విధాన వాతావరణం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందన్నారు. 1970వ దశకంలో అధిక చమురు ధరలతో ద్రవ్యోల్బణం పరుగులు తీసింది. మధ్యప్రాచ్య దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకునే దేశాల్లో మాంద్యం ఆవరించింది.