ముంబై, సెప్టెంబర్ 6: వైద్య ఖర్చుల క్లెయింలకు 100 శాతం క్యాష్లెస్ సెటిల్మెంట్ జరిగేందుకు హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలతో కలసి కసరత్తు చేస్తున్నట్టు ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ చైర్మన్ దేబశిష్ పాండా వెల్లడించారు. ముంబైలోని గ్లోబల్ ఫిన్టెక్ కార్యక్రమంలో బుధవారం పాండా మాట్లాడుతూ ప్రస్తుతం క్యాష్లెస్ క్లెయిం ప్రక్రియ సజావుగా జరగడం లేదని, మొత్తం బిల్లింగ్లో బీమా సంస్థలు వివిధ ఖర్చుల పేరిట 10 శాతం లేదా అంతకుమించి తగ్గించి చెల్లిస్తున్నాయని అన్నారు.
అలాగే పలు హాస్పిటళ్లు ఏదో ఒక సాకు చెప్పి, క్యాష్లెస్ అడ్మిషన్లను అనుమతించడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరితంగా నూరుశాతం క్యాష్లెస్ క్లెయిం సెటిల్మెంట్స్ జరిగేలా ఆరోగ్య బీమా సంస్థలు, నేషనల్ హెల్త్ ఆథారిటీ, ఇన్సూరెన్స్ కౌన్సిల్తో కలిసి బీమా రెగ్యులేటర్ పనిచేస్తున్నదని పాండా వివరించారు. ఇందుకోసం మరిన్ని హాస్పిటళ్లను నేషనల్ హెల్త్ ఎక్సేంజ్లో చేర్చేందుకు నేషనల్ హెల్త్ అథారిటీ, ఇన్సూరెన్స్ కౌన్సిల్తో ఐఆర్డీఏఐ కలిసి పనిచేస్తున్నదన్నారు.
ప్రస్తుతం మెడిక్లెయిం పాలసీల ధర అధికశాతం వృద్ధులకు అందుబాటులో లేదని, వారికి సరసమైన ధరలో లభించేలా ఇన్సూరెన్స్ కంపెనీలతో చర్చిస్తున్నామని ఐఆర్డీఏఐ చైర్మన్ తెలిపారు. 2047కల్లా ‘అందరికీ బీమా’ అందించాలన్న లక్ష్యాన్ని అంతకంటే చాలా ముందుగానే సాధిస్తామని పాండా ధీమా వ్యక్తం చేశారు.