న్యూఢిల్లీ: మీరు ఇంకా పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేయలేదా… అయితే, ఆ పని ఈ రోజే చేసేయండి.. ఆధార్తో పాన్ కార్డ్ అనుసంధానానికి ఈ నెలాఖరు వరకు కేంద్ర ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఈ నెల 30 నాటికి పాన్ కార్డుతో ఆధార్ను అనుసంధానించకుంటే మీరు పలు రకాల కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
మీ బ్యాంక్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లపై ప్రభావం పడొచ్చు. మీ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం మీద టీడీఎస్ రెట్టింపు చెల్లించాల్సి వస్తుంది. బ్యాంకింగ్ లావాదేవీలతో పలు ఇబ్బందులను ఎదుర్కోక తప్పక పోవచ్చు.
ఆధార్తో లింక్ చేయకపోతే పాన్ కార్డు ఇన్ ఆపరేటివ్గా మారుతుంది. అప్పుడు మీరు మీ పాన్ కార్డును ఆర్థిక లావాదేవీల కోసం ఉపయోగించలేరు. జూన్ 30 తర్వాత కూడా పాన్ కార్డు లింక్ చేసుకోకుంటే రూ.1000 జరిమాన చెల్లించాల్సి వస్తుంది.
గడువులోగా ఆధార్ కార్డుతో పాన్ అనుసంధానం చేయకపోతే పెనాల్టీ విధించాలన్న నిబంధన ఈ ఆర్థిక సంవత్సరం నుంచే అమలులోకి వచ్చింది. ఆదాయం పన్ను చట్టం 1961లో కొత్తగా 234 హెచ్ సెక్షన్ చేర్చారు.
పాన్ కార్డు ఇన్ ఆపరేటివ్ అయితే మీరు చేసే ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం మీద బ్యాంకు 20 శాతం టీడీఎస్ డిడక్ట్ చేస్తుందని ఓప్టిమా మనీ మేనేజర్స్ ఫౌండర్ అండ్ సీఈవో పంకజ్ మాథ్పాల్ పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆదాయం పన్ను చట్టం కింద అమలులో ఉన్న నిబంధన ప్రకారం సాధారణ పౌరులు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.40 వేల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు చేయొచ్చు. అప్పటి వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
సీనియర్ సిటిజన్లకైతే రూ.50 వేల వరకు మినహాయింపు ఉంది. పరిధి దాటిన ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లపై 10 శాతం టీడీఎస్ను బ్యాంకులు డిడక్ట్ చేసుకుంటాయి.
ఆదాయం పన్ను చట్టంలోని 139 ఏఏ సెక్షన్ కింద ఆధార్ కార్డుతో పాన్ కార్డు అనుసంధానం తప్పనిసరిగా మారింది. 2017 జూలై ఒకటో తేదీ పాన్ కార్డు పొందిన వారు ఆధార్తో లింక్ చేసుకోవాల్సిందే.