Wipro Q4 | విప్రో గతేడాది (2021-22) చివరి త్రైమాసికంలో నాలుగు శాతం నికర లాభం పెంచుకుంది. 2020-21తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో నికర లాభం రూ.2,972 కోట్ల నుంచి రూ.3,087 కోట్లకు పెరిగింది. స్థూల ఆదాయంలో 28.4 శాతం పెరిగి రూ. 20,860 కోట్లు ($2.7 బిలియన్లకు) చేరింది. ఐటీ సర్వీసెస్ సెగ్మెంట్ ఆదాయం 2.722 బిలియన్ డాలర్లు సంపాదించగా, గతేడాది మూడో త్రైమాసికంతో పోలిస్తే 3.1 శాతం, 2020-21 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంతో పోలిస్తే 26.4 శాతం ఎక్కువ.
ఏడాది క్రితంతో పోలిస్తే 27 శాతం గ్రోత్తో 2021-22 నాలుగో త్రైమాసికంలో 10.4 బిలియన్ల డాలర్ల ఆదాయం సంపాదించాం. వరుసగా ఆరో త్రైమాసికంలో మూడు శాతానికి పైగా ఆదాయంలో వృద్ధి సాధించాం అని విప్రో సీఈవో కం ఎండీ థెర్రీ డెలాపోర్టే చెప్పారు. ఐటీ సర్వీసుల బిజినెస్లో 1-3 శాతం వృద్ధిరేటుతో 2.748 బిలియన్ల డాలర్ల నుంచి 2.8 బిలియన్ల డాలర్లకు చేరుకుంటుందని విప్రో అంచనా వేసింది.
నార్త్ అమెరికా, యూరప్, ఆసియా మార్కెట్లు తమ సంస్థ వృద్ధికి కారణం అయ్యాయని విప్రో తెలిపింది. 100 మిలియన్ల డాలర్ల విలువ గల ఇద్దరు క్లయింట్లు, 50మిలియన్ డాలర్ల విలువ గల మరో క్లయింట్తో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు పేర్కొంది. సిబ్బంది నిర్వహణ ఖర్చులు పెరగడంతో సంస్థ నిర్వహణ ఖర్చులు పెరిగాయని విప్రో తెలిపింది. దీంతో ఆపరేటింగ్ లాభాలు 1.2 శాతం తగ్గి రూ.3,511 కోట్లకు పడిపోయాయి.