Crypto in Whatsapp | బిట్ కాయిన్.. ఎథీరియం.. డోజ్ కాయిన్ తదితర క్రిప్టో కరెన్సీలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగుతున్నది. దీనిపై ప్రభుత్వాల నియంత్రణ లేదు. అయినా, మెటా ప్లాట్ఫామ్స్ అనుబంధ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఇక నుంచి క్రిప్టో కరెన్సీ లావాదేవీల నిర్వహణకు అనుమతించాలని నిర్ణయం తీసుకున్నది. దీన్ని ముందుగా పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనుంది. ఇందుకోసం కొందరు యూజర్లకు నోవి పేరుతో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. అమెరికాలో ఎంపిక చేసిన యూజర్ల వాట్సాప్ల్లో ఈ నోవి ఫీచర్ జోడించింది.
యూజర్లు నోవీ ఫీచర్లోకి వెళ్లి సంబంధిత సమాచారం అందివ్వాలి. సమాచార గోప్యత పాటించడంతో పాటు ఎండ్ టూ ఎండ్ ఎన్స్క్రిప్షన్గా ఈ ఫీచర్ ఉంటుంది. ఇందులో అమెరికా డాలర్లను చేరిస్తే అది డిజిటల్ కరెన్సీగా మారుతుంది. పాక్సోస్ ట్రస్ట్ అనే సంస్థ ఈ ప్రక్రియ చేపడుతుంది. ఆరు వారాలు ఈ సౌకర్యం యూజర్లకు అందుబాటులో ఉంటుంది. ఎంపిక చేసిన యూజర్ల ఆధ్వర్యంలో సాగే లావాదేవీలను మెటా ప్లాట్ఫామ్స్ యాజమాన్యం నిశితంగా పరిశీలిస్తుంది. నోవి పైలట్ ప్రాజెక్ట్ ఫలితాల ఆధారంగా ఈ సేవలు అందుబాటులోకి తేవాలా.. వద్దా అన్న విషయమై తుది నిర్ణయం తీసుకోనున్నది.
అయితే ప్రభుత్వాల అజమాయిషీ లేని క్రిప్టో కరెన్సీల వల్ల ఆర్థిక గందరగోళ పరిస్థితులు తలెత్తుతాయని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. టెక్ నిపుణులు, దిగ్గజ సంస్థలు మాత్రం భవిష్యత్ అంతా క్రిప్టో కరెన్సీలదేనని చెబుతున్నారు. టెస్లా సీఈవో ఎలన్మస్క్, ఆపిల్ సీఈవో టిమ్కుక్ వంటి వారు గణనీయంగా పెట్టుబడులు పెడుతున్నారు.