ఇన్వెస్టర్లు అత్యధికంగా ట్రాక్చేసే నిఫ్టీ-50 ఇండెక్స్ చరిత్రాత్మక 20,000 పాయింట్ల స్థాయికి చేరువలో ఉన్న ప్రస్తుత తరుణంలో తమ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్లు) మరింత విలువను ఎలా చేకూరుస్తాయన్న సందేహాలు మదుపరుల్లో తలెత్తడం సహజం. ఎంఎఫ్ల్లో పెట్టుబడుల్ని వెనక్కు తీసుకోవాలా? కొనసాగించాలా? మరింతగా మదుపు చేయాలా? తదితర ప్రశ్నలు మదిని తొలుస్తాయి. ఈ ఏడాది సూచీల పనితీరు ఎలా ఉందంటే..
తొలి 3 నెలలూ పరిమిత శ్రేణిలో కొట్టుమిట్టాడిన నిఫ్టీ-50.. మార్చి 20న 16,828 పాయింట్ల కనిష్ఠానికి పడింది.
జూలై 19 వరకూ 16.74 శాతం పెరిగింది. ఇదే సమయంలో నిఫ్టీ మిడ్క్యాప్-150 ఇండెక్స్ (22.44 శాతం), నిఫ్టీ స్మాల్క్యాప్-250 (25.85 శాతం)నిఫ్టీ 50 కన్నా మిన్నగా రాణించాయి.
దేశీ ఇన్వెస్టర్ల ఆసక్తితో కొన్ని మిడ్, స్మాల్షేర్లు మార్చి నుంచి భారీగా పెరిగాయి. అయితే ఇకపైనా ఇదే జోరు ఉంటుందో లేదోనన్న ఆందోళన మదుపరుల్లో కనిపిస్తున్న వేళ నిపుణులు ఏమంటున్నారంటే…
మల్టీక్యాప్, ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ మెరుగు ‘ఆర్థిక వ్యవస్థ వృద్ధిచెందేకొద్దీ ఇండెక్స్ మరిన్ని రికార్డుల్ని సృష్టిస్తుంది. ఈ సమయంలో ఇన్వెస్టర్లు ఆయా షేర్ల విలువల్ని ట్రాక్ చేస్తూ ఉండాలి. కృత్రిమ విలువతో కూడిన షేర్లు, థీమ్స్ను ఛేజ్ చేయకూడదు. కొత్త ఇన్వెస్టర్ అయితే పెట్టుబడులకు ఇది మంచి తరుణమే. కానీ ఐదేండ్ల గడువు నిర్దేశించుకోవాలి. మల్టీక్యాప్ ఫండ్స్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లో సిప్లు, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్స్ ద్వారా మదుపు చేయవచ్చు.’
-దీపక్ ఛబ్రియా, ఎండీ,
యాక్సిమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్
‘ఈక్విటీలు మరికొంత పెరిగే అవకాశం ఉంది. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు వారి పెట్టుబడుల్ని సిప్ల ద్వారా కొనసాగించవచ్చు, 2-3 ఏండ్ల లక్ష్యంగా మదుపు చేయాలి. ఇప్పటికే లాభాల్లో ఉన్నవారు అసలు పెట్టుబడిని పరిరక్షించుకునేందుకు ఈక్విటీ ఫండ్స్ నుంచి కొంత లాభాన్ని తీసుకోవాలి. కానీ సిప్లు నిలిపివేయరాదు.’
-నితిన్రావు, సీఈవో, ఇన్క్రెడ్ వెల్త్