Amazon | తమ సంస్థలో ఎంతమాత్రమూ అవినీతిని సహించేది లేదని గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ స్పష్టం చేసింది. భారత ప్రభుత్వ అధికారులకు తమ ప్రతినిధులు ముడుపులు చెల్లించారని వచ్చిన ఆరోపణలపై అమెజాన్ దర్యాప్తు ప్రారంభించిందని వార్తలొచ్చాయి. దీంతో సంబంధం ఉన్న సీనియర్ కార్పొరేట్ కౌన్సిల్ ప్రతినిధులను అమెజాన్ సెలవుపై పంపినట్లు సమాచారం. పూర్తిగా దర్యాప్తు జరిగిన తర్వాత సరైన చర్య తీసుకుంటామని అమెజాన్ ప్రతినిధి చెప్పారు. అంతే గానీ, ప్రత్యేకమైన ఆరోపణలు, ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్న తీరుపై ఎటువంటి వ్యాఖ్యలు చేయబోమన్నారు. అయితే, భారత అధికారులకు అమెజాన్ ప్రతినిధులు ముడుపులు చెల్లించారని వచ్చిన ఆరోపణలను ధృవీకరించడం గానీ, నిరాకరించడం గానీ ఆ సంస్థ అధికార ప్రతినిధి చేయలేదు.
అమెరికా కేంద్రంగా పని చేస్తున్న అమెజాన్ వంటి సంస్థలు పౌరవేగులు చేసే ఫిర్యాదులను తీవ్రంగా పరిగణిస్తాయి. ప్రత్యేకించి బిజినెస్ సంపాదించుకునేందుకు విదేశీ ప్రభుత్వాధికారులకు ముడుపులు చెల్లించారన్న ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తాయి. తాజాగా భారత్లో బిజినెస్, ఇతర లావాదేవీలపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నుంచి అమెజాన్ దర్యాప్తును ఎదుర్కోనున్న తరుణంలో తాజా అభియోగాలు రావడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
విక్రేతల పట్ల ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్, ప్రిడేటరీ ప్రైసింగ్, యాంటీ కాంపిటీటివ్ ప్రాక్టీసెస్ తదితర అంశాల్లో అమెజాన్ తీరుపై సీసీఐ దర్యాప్తు చేపడుతుంది. ఇప్పటికే రిలయన్స్ రిటైల్లో ఫ్యూచర్ రిటైల్ విలీనానికి వ్యతిరేకంగా అమెజాన్ న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.