Flipkart |న్యూఢిల్లీ, జూలై 31: దేశీయ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్లో టైగర్ గ్లోబల్కు చెందిన పూర్తి వాటాను అమెరికా రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ కొనేసింది. 1.4 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,600 కోట్లు)కు ఈ మొత్తం వాటాను దక్కించుకున్నది. ఫ్లిప్కార్ట్ విలువను 35 బిలియన్ డాలర్లు (సుమారు రూ.2.89 లక్షల కోట్లు)గా లెక్కించి ఈ డీల్ జరిగినట్టు చెప్తున్నారు. కాగా, ఫ్లిప్కార్ట్లో టైగర్ గ్లోబల్ నుంచి అదనపు షేర్లను కొన్నట్టు వాల్మార్ట్ ప్రతినిధి చెప్తున్నప్పటికీ, ఎంతకు కొన్నారన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. ‘గత కొన్నేండ్లుగా టైగర్ గ్లోబల్ సహకారం మరువలేనిది. ఫ్లిప్కార్ట్లో విలువైన భాగస్వామిగా కొనసాగింది’ అన్నారు.
ఫ్లిప్కార్ట్ తొలినాళ్ల నుంచి టైగర్ గ్లోబల్ కీలక మదుపరిగానే ఉంటూ వస్తున్నది. 2009లో ఫ్లిప్కార్ట్లోకి టైగర్ గ్లోబల్ 9 మిలియన్ డాలర్ల పెట్టుబడితో వచ్చింది. 2018లో ఫ్లిప్కార్ట్లో మెజారిటీ వాటాను వాల్మార్ట్ కొన్నప్పటికీ.. టైగర్ గ్లోబల్ పెట్టుబడులు మాత్రం అలాగే ఉన్నాయి. వాటాను పెంచుకునేందుకు 2021 లో అదనపు పెట్టుబడులనూ పెట్టింది. దీంతో ఫ్లిప్కార్ట్లో టైగర్ గ్లోబల్ వాటా దాదాపు 4 శాతానికి చేరింది. అయితే ఇప్పుడు ఆ వాటాను వాల్మార్ట్ పరమైంది. ఇదిలావుంటే ఫ్లిప్కార్ట్లో యాక్సెల్ పార్ట్నర్స్ సైతం తమ 1 శాతం వాటాను వాల్మార్ట్కు సుమారు 350 మిలియన్ డాలర్లకు అమ్ముకున్నట్టు తెలుస్తున్నది.