Vistara Airlines | దేశీయ విమానయాన సంస్థ విస్తారా రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులను గెలుచుకున్నది. భారత్, దక్షిణాసియాల్లోనే బెస్ట్ ఎయిర్లైన్, బెస్ట్ ఎయిర్లైన్ స్టాఫ్ అవార్డులను అందుకున్నది. ఇటీవల జరిగిన ఓ వేడుకలో విస్తారా ఈ అవార్డులను అందుకున్నది. అంతర్జాతీయ విమాన ప్రయాణికులు, వారి అనుభవాల ఆధారంగా ఈ అవార్డులకు విస్తారాను ఎంపిక చేశారు. 350 గ్లోబల్ ఎయిర్లైన్స్లో విస్తారా 28వ స్థానం పొందింది. 2019 సెప్టెంబర్-2021 జూలై మధ్య 1.3 కోట్ల మందికి పైగా ప్రయాణికుల అభిప్రాయాల ఆధారంగా వరల్డ్ ఎయిర్లైన్ అవార్డులను ఖరారు చేశారు.
దీనిపై విస్తారా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లెస్లీ థంగ్ స్పందిస్తూ రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులను గెలుచుకున్నందుకు తమకు చాలా ఆనందంగా ఉందన్నారు. తమ సంస్థలో ప్రతి టీం సభ్యుడు ప్రయాణికులకు ప్రపంచ ప్రమాణాలతో కూడిన ప్రయాణాన్ని అందుబాటులోకి తేవడానికి జరిపిన నిరంతర కృషి వల్లే ఈ గుర్తింపు లభించింది అన్నారు. తమపై ప్రయాణికులకు గల నమ్మకానికి గుర్తింపు తీసుకొచ్చినందుకు స్కైట్రాక్స్కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు.