(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): అదానీ గ్రూప్ కంపెనీల్లో గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ ప్రమోటర్ అని ‘హిండెన్బర్గ్’ చేసిన ఆరోపణలు నిజమేనని ఎట్టకేలకు రూఢీ అయింది. వినోద్తో తమకెలాంటి సంబంధంలేదని ఇప్పటివరకూ మభ్యపెట్టిన అదానీ గ్రూప్ మాట మార్చింది. వినోద్ అదానీ కూడా తమ గ్రూప్ ప్రమోటర్లలో భాగమేనని తెలిపింది.
‘అదానీ గ్రూప్లోని పలు లిస్టెడ్ కంపెనీల్లో వినోద్ అదానీ, రాజేశ్ అదానీ వ్యక్తిగత ప్రమోటర్లుగా ఉన్నారు’ అని వెల్లడించింది. విదేశాల్లో డొల్ల కంపెనీల ద్వారా వినోద్ అదానీ.. అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల దందా నడిపిస్తారని హిండెన్బర్గ్ నివేదిక ఆరోపించింది. అయితే, ఈ వార్తలను అదానీ గ్రూప్ ఖండించింది. ప్రవాస భారతీయుడైన వినోద్.. తన సొంత వ్యాపార లావాదేవీలే చూసుకుంటున్నారని, ఆయనతో తమ గ్రూప్ వ్యాపార లావాదేవీలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చింది.
టేకోవర్లో మాయాజాలం
కిందటేడాది జరిపిన ఏసీసీ, అంబుజా సిమెంట్ కంపెనీల కొనుగోళ్లలో అదానీ గ్రూప్ పెద్ద మాయాజాలం చేసినట్టు తెలుస్తున్నది. గతంలో ప్రకటించినట్టు అసలు ఆ రెండు కంపెనీలు అదానీ గ్రూప్నవి కావని అర్థమవుతున్నది. ఈ రెండు కంపెనీల అసలు లబ్దిదారుడు వినోద్ అదానీ అని సమాచారం. ఈ మేరకు ‘ది మార్నింగ్ కాంటెక్ట్స్’ అనే పత్రిక ప్రత్యేక కథనం ప్రచురించింది. మారిషస్లోని తన కంపెనీ ‘ఎండీవర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్’ ద్వారా వినోద్ అదానీ ఈ కొనుగోలుకు అవసరమైన రూ.85,000 కోట్లు సమకూర్చారని ఆ పత్రిక పేర్కొంది.