హైదరాబాద్, ఫిబ్రవరి 27: దేశంలో టీఎంటీ బార్స్ ఉత్పత్తి, విక్రయాల్లో అగ్రగామి సంస్థల్లో ఒకటైన శ్యామ్ స్టీల్.. ప్రముఖ హీరో విజయ్ దేవరకొండను ప్రచారకర్తగా నియమించుకున్నది. ఈ సందర్భంగా కంపెనీ డైరెక్టర్ లలిత్ బేరివాలా మాట్లాడుతూ.. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వచ్చే ఐదేండ్లలో 500 రిటైల్ అవుట్లెట్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. అలాగే కంపెనీ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 0.7 మిలియన్ టన్నుల నుంచి 1.35 మిలియన్ టన్నులకు పెంచుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. మరోవైపు, బ్రౌన్ఫిల్డ్, గ్రీన్ఫిల్డ్ ప్రాజెక్టుల ప్లాంట్లను మరింత విస్తరించడానికి రూ.2,500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టబోతున్నట్లు బేరివాలా తెలియజేశారు.
తెలంగాణలో 13.90 శాతం వృద్ధి
నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో రాణిస్తున్నదని లలిత్ అన్నారు. గడిచిన ఐదేండ్లలో సరాసరిగా 13.90 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నదని, ముఖ్యంగా మౌలిక సదుపాయాల రంగం అంచనాలకుమించి రాణిస్తుండటం ఇందుకు కారణమన్నారు. గత ఐదేండ్లలో ఏపీ 13.14 శాతం వృద్ధిని సాధించింది. మరోవైపు గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.4,500 కోట్ల రాబడిని ఆర్జించిన సంస్థ.. వచ్చే మూడేండ్లలో రెండింతలు రూ.9 వేల కోట్లకు చేరుకునే అవకాశం ఉందన్నారు.