Vedanta to Telangana | కరోనా మహమ్మారితో సెమీ కండక్టర్ల ఉపయోగం.. వాటికి ఉన్న గిరాకీ ఏమిటో ప్రపంచానికి తెలిసి వచ్చింది. దేశాలన్నీ సొంతంగా సెమీ కండక్టర్ల తయారీపై కేంద్రీకరించాయి. చిప్లకు పెట్టింది పేరుగా ఉన్న తైవాన్ కంపెనీతో కేంద్రం ఒప్పందాలు కుదుర్చుకున్నది. దేశీయంగా సెమీ కండక్టర్ల తయారీ యూనిట్లు నిర్మించే సంస్థలకు కేంద్రం రాయితీలు.. ఇన్సెంటివ్లు ప్రకటించింది. తదనుగుణంగా దేశంలోని పలు కార్పొరేట్ కంపెనీలు చిప్ల తయారీ యూనిట్ల ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టేందుకు సమాయాత్తం అవుతున్నాయి. ఈ బాటలోనే ప్రయాణించాలని అనిల్ అగర్వాల్ సారధ్యంలోని వేదంతా గ్రూప్ కూడా డిసైడైంది. వచ్చే మూడేండ్లలో దేశంలో పూర్తి పర్యావరణ హితమైన.. అత్యాధునిక చిప్, గ్లాస్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ స్థాపించనున్నది. ఇందుకు రూ.60 వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది.
ఈ దిశగా ప్రపంచంలోని టాప్ ఫాబ్రికేషన్ తయారీ దారులతో జాయింట్ వెంచర్లు, టెక్నాలజీ అండ్ ఈక్విటీ పార్టనర్షిప్ల కోసం వేదాంతా గ్రూప్ గాలిస్తున్నది. అయితే, భారత్లో సెమీ కండక్టర్ల తయారీ యూనిట్ నిర్మించడానికి అనిల్ అగర్వాల్ చేస్తున్న రెండో ప్రయత్నం ఇది. సరిగ్గా నాలుగేండ్ల క్రితం 2017 డిసెంబర్లో కార్ల్యెల్ గ్రూప్ నుంచి జపాన్ గ్లాస్ సబ్స్ట్రాక్ మాన్యుఫాక్చరర్ అవన్స్ట్రేట్ సంస్థను టేకోవర్ చేసింది వేదాంత.
సెమీ కండక్టర్ల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి 250-400 ఎకరాల భూమి కావాలి. తొలి రెండు దశల్లో ప్రాజెక్టు పూర్తికి ఆరు బిలియన్ల డాలర్లు (రూ.45 వేల కోట్లు) – 8 బిలియన్ల డాలర్లు (రూ.60 వేల కోట్లు) అవసరం. తదుపరి విస్తరణకు మరికొంత పెట్టుబడులు అవసరం. ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన భూమి.. అనుమతుల కోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు చివరి దశలో ఉన్నాయని అవన్స్ట్రేట్ ఎండీ ఆకర్ష్ హెబ్బర్ అన్నట్లు ఓ ఇంగ్లిష్ వార్తా పత్రిక ఓ వార్తా కథనం ప్రచురించింది.
తెలంగాణతోపాటు హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్లు హెబ్బర్ అన్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఇన్సెంటివ్లు కావాలని.. అదనంగా 10-15 శాతం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ కోరుతున్నామన్నారు. తైవాన్ చిప్ మేకర్లు టీఎస్ఎంసీ, యునైటెడ్ మైక్రో ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్, ఫాక్స్కాన్, కొరియన్ ఎల్ జీ, శ్యామ్సంగ్, జపానీస్ శార్ప్ సంస్థలతోనూ చర్చలు జరుపుతోంది. మరోవైపు తెలంగాణతోపాటు మరో రెండు రాష్ట్రాల్లో సెమీ కండక్టర్ల యూనిట్ ప్రారంభించేందుకు టాటా సన్స్ కూడా సంప్రదిస్తున్నట్లు వార్తలొచ్చాయి.