UPI Payments | దేశ ఆర్థిక వ్యవస్థను ఆన్లైన్ లావాదేవీల వైపు బలవంతంగా నడిపించిన మోదీ సర్కారు.. ఇప్పుడు వినియోగదారుల నడ్డి విరిచే దిశగా అడుగులేస్తున్నది.
పెద్ద నోట్ల రద్దు దగ్గర్నుంచి నగదు వద్దు.. ఆన్లైన్ చెల్లింపులే ముద్దు.. అంటూ ప్రోత్సహించిన కేంద్ర ప్రభుత్వం.. పన్నులతో అదనపు ఆదాయాన్ని రాబట్టేందుకు ప్రజలపై అనవసరపు భారాన్ని మోపుతున్నది.
వ్యాపారులకు వ్యాలెట్లు, కార్డులు తదితర ప్రీపెయిడ్ సాధనాల ద్వారా చేసే యూపీఐ పేమెంట్స్పై 1 శాతానికిపైగా ఇంటర్చేంజ్ ఫీజులు పడబోతున్నాయి మరి. వచ్చే నెల 1 నుంచి ఇవి అమల్లోకి రానుండగా..వినియోగదారులపై ఆ ప్రభావం ఉండనున్నది.
న్యూఢిల్లీ, మార్చి 28: గల్లీలోని కిరాణా కొట్టు దగ్గర్నుంచి.. నగరం నడిబొడ్డున ఉన్న షాపింగ్ మాల్స్దాకా ఎక్కడ చూసినా ఇప్పుడు ఆన్లైన్ లావాదేవీలే. జేబులో చిల్లిగవ్వ లేకపోయినా.. స్మార్ట్ఫోన్ ఉందికదా అన్న ధీమా నేడు ప్రతిఒక్కరిది. అయితే ఈ భరోసా.. ఇకపై భారంగా మారిపోనున్నది. వ్యాలెట్లు లేదా కార్డుల వంటి ప్రీపెయిడ్ సాధనాల ద్వారా జరిగే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలపై ఏప్రిల్ 1 నుంచి ఇంటర్చేంజ్ ఫీజులు వర్తించనున్నాయి. యూపీఐ లావాదేవీలను పర్యవేక్షిస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తాజా సర్క్యులర్ ప్రకారం రూ.2,000, ఆపై లావాదేవీలపై ఆన్లైన్ వ్యాపారులు, పెద్ద వ్యాపారులతోపాటు ఆఫ్లైన్లోని చిరు వ్యాపారులకు 1.1 శాతం వరకు ఈ ఇంటర్చేంజ్ ఫీజులు పడబోతున్నాయి.
ప్రస్తుతం యూపీఐ లావాదేవీలపై ఎటువంటి చార్జీలు లేవు. నామమాత్రపు వ్యవస్థీకృత ఖర్చులు తప్ప. కానీ శనివారం నుంచి గరిష్ఠంగా ఒక్కో లావాదేవీపై రూ.15 వరకు వ్యాపారులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. దీంతో ఈ భారాన్ని సదరు వ్యాపారులు సహజంగానే తమ వినియోగదారులపై మోపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల ఇప్పుడు లభిస్తున్న ప్రతీ వస్తూత్పత్తి, సేవల ధర.. వచ్చే నెల 1 తర్వాత పెరిగే వీలుందన్న అంచనాలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. ప్రీపెయిడ్ సాధనాలను జారీ చేసే సంస్థలూ లావాదేవీ ప్రక్రియలో భాగంగా బ్యాంకులకు 15 బేసిస్ పాయింట్ల మేర చెల్లింపులు జరుపాల్సి ఉంటుందని సర్క్యులర్లో ఎన్పీసీఐ పేర్కొన్నది. దీనివల్ల కార్డు వినియోగదారులపై, ముఖ్యంగా క్రెడిట్ కార్డు యూజర్లపై హిడెన్ చార్జీలు (పరోక్ష చార్జీలు) పెరిగే వీలుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.
ఇంటర్చేంజ్ ఫీజు అనేది క్రెడిట్ లేదా డెబిట్ కార్డు చెల్లింపు ప్రక్రియ జరిగినప్పుడు బ్యాంకుకు వ్యాపారి చెల్లించే ఫీజు. పేమెంట్ ప్రాసెసింగ్ ఖర్చుల నిమిత్తం బ్యాంకులు వసూలు చేస్తాయి. కస్టమర్ వినియోగించే కార్డు ఆధారంగా కూడా చార్జీల్లో తేడాలుంటాయి. కాగా, మొదటి ఆరు నెలల్లో (సెప్టెంబర్ 30లోగా) ఈ చార్జీలను ఎన్పీసీఐ సమీక్షించి మళ్లీ ఓ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తున్నది.
నిజానికి దేశంలో యూపీఐ లావాదేవీలు నానాటికీ భారీగా పెరుగుతూపోతున్నాయి. రికార్డు స్థాయిలో జరుగుతున్న ఈ ట్రాన్జాక్షన్స్తో బ్యాంకులకు పనిభారం కూడా పెరిగింది. అయితే ఇవన్నీ ఉచితంగానే జరుగుతుండటంతో వీటిపట్ల చాలాకాలం నుంచే బ్యాంకుల్లో అసంతృప్తి పెరుగుతున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి. చివరకు ఎన్పీసీఐ సైతం పెదవివిరుస్తున్నదనే అంటున్నారు. ఈ క్రమంలోనే ఈ ఇంటర్చేంజ్ ఫీజులు వచ్చిపడ్డాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.