హైదరాబాద్, మే 6: ప్రభుత్వరంగ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాలకుమించి రాణించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.2,811 కోట్ల లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,440 కోట్ల లాభంతో పోలిస్తే 80.57 శాతం ఎగబాకింది. సమీక్షకాలంలో బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 11.11 శాతం నుంచి 7.53 శాతానికి దిగిరాగా, నికర ఎన్పీఏ 1.70 శాతానికి దిగొచ్చింది.
మార్చి 31 నాటికి బ్యాంక్ మొత్తం వ్యాపారం రూ.19,27,621 కోట్లకు చేరుకున్నది. గత త్రైమాసికంలో రూ.2,954 కోట్ల మొండి బకాయిలను వసూలు చేసినట్టు బ్యాంక్ ఎండీ, సీఈవో మణిమేఖలై తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.20 వేల కోట్ల రుణాలను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ రూ.15 వేల కోట్లు వసూలు చేయగలిగామని ఆమె చెప్పారు.