హైదరాబాద్, అక్టోబర్ 25: హైదరాబాదీ కంపెనీ బయోలాజికల్ ఈ.లిమిటెడ్ (బీఈ) వ్యాక్సిన్ ప్లాంటు విస్తరణకు యూఎస్ ప్రభుత్వ సంస్థ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీఎఫ్సీ) 50 మిలియన్ డాలర్లు (రూ.380 కోట్లు) పెట్టుబడి చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్లాంటు విస్తరణ, పెట్టుబడి ప్రణాళికల్ని సోమవారంనాడిక్కడ డీఎఫ్సీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డేవిడ్ మార్చిక్, బీఈ మేనేజింగ్ డైరెక్టర్ మహిమా దాట్ల వెల్లడించారు. కొవిడ్-19 వ్యాక్సిన్లు ఉత్పత్తిచేస్తున్న హైదరాబాద్లోని బీఈ ప్లాంటు సామర్థ్యాన్ని విస్తరించేందుకు ఈ పెట్టుబడిని ప్రతిపాదించారు. బీఈతో డీఎఫ్సీ భాగస్వామ్యం ద్వారా 2022 సంవత్సరాంతానికల్లా 100 కోట్లకుపైగా కొవిడ్ టీకాలు ఉత్పత్తి చేసే వార్షిక సామర్థ్యాన్ని ఈ ప్లాంటు సంతరించుకుంటుందని మార్చిక్ తెలిపారు.
వచ్చే నెలాఖరుకు కొర్బేవ్యాక్స్…
బయోలాజికల్.ఈ అభివృద్ధి పర్చిన కొవిడ్ వ్యాక్సిన్ కొర్బేవ్యాక్స్ నవంబర్ చివర్లో మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కంపెనీ ఎండీ వెల్లడిస్తూ…10 కోట్ల టీకాల్ని విడుదల చేసేందుకు తాము సిద్ధమవుతున్నామన్నారు. ప్రస్తుతం తయారుచేసిన వ్యాక్సిన్ డోసుల్ని నియంత్రణాపరమైన పరీక్షల కోసం కాసౌలిలో ఉన్న సెంట్రల్ డ్రగ్స్ ల్యాబోరేటరీకి పంపుతున్నట్లు తెలిపారు.