న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: టీవీఎస్ మోటర్ లాభాలకు అమ్మకాల సెగ గట్టిగానే తాకింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 18.34 శాతం తగ్గి రూ.236.56 కోట్లకు పరిమితమైనట్టు వెల్లడించింది. అమ్మకాలు తగ్గడం వల్లనే లాభాల్లో గండిపడిందని పేర్కొంది. కానీ ఆదాయం మాత్రం రూ.6,094 కోట్ల నుంచి రూ.6,597.35 కోట్లకు ఎగబాకినట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. ఇక రూ.288 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని గడించింది. ఈ త్రైమాసికంలో సంస్థ 8.35 లక్షల వాహనాలను విక్రయించింది. మరోవైపు కంపెనీ చైర్మన్గా రాల్ఫ్ డైటర్ స్పెథ్ను నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నది. వేణు శ్రీనివాస్ ఎండీగా, గౌరవ చైర్మన్గా వ్యవహరించనున్నారు.