హైదరాబాద్, ఆగస్టు 11: లాటిన్ అమెరికన్ దేశాల నుంచి లిథియం, ఇతరత్రా ఖనిజాలను జాయింట్ వెంచర్ భాగస్వాముల ద్వారా నేరుగా దిగుమతి చేసుకొనేందుకు తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ)ను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలియజేశారు. ఈ నిర్ణయం రాష్ట్రంలో అడ్వాన్స్డ్ సెల్ కెమిస్ట్రీ మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్కు ఎంతగానో లాభిస్తుందని అభిప్రాయపడ్డారు. బ్యాటరీల తయారీకి కావాల్సిన లిథియంసహా కీలకమైన ముడి సరుకుల సరఫరాకు వీలు కలుగుతుదని చెప్పారు. ఈ తరహా నిర్ణయం ఇప్పటిదాకా దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదని పేర్కొన్నారు. నూతన టెక్నాలజీలకు, కొత్త ఆలోచనలకు ఆది నుంచీ తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్న మంత్రి.. టీ-వర్క్స్, టీ-హబ్, వుయ్-హబ్, టాస్క్, టీఎస్ఐసీ తదితర కార్యక్రమాలను ఇందుకు నిదర్శనంగా పేర్కొన్నారు. గిగా కారిడార్లో భాగంగా హైదరాబాద్లో జీఎంఆర్ ఏరోసిటీలో అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ నిర్మిస్తున్న అడ్వాన్స్డ్ ఎనర్జీ రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్కు మంత్రి కే తారక రామారావు శంకుస్థాపన చేశారు. అనంతరం రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్న అమరరాజా గ్రూప్ను అభినందించారు. భవిష్యత్తు ఎనర్జీ అవసరాలను తీర్చడంలో కంపెనీ చిత్తశుద్ధిని, అంకితభావాన్ని కొనియాడారు. ప్రభుత్వం తరఫున కావాల్సిన సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. అమరరాజాతో దేశంలోనే తొలి ఎనర్జీ పార్క్ తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరుతుండటం ఆనందంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సంస్థ ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద ఓ గిగాఫ్యాక్టరీని తెస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఇది తొలి గిగాఫ్యాక్టరీ అని, దేశంలోని అతిపెద్ద ఫ్యాక్టరీల్లో ఒకటని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి, ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ సుజయ్ కారంపురి, ఎంపీ రంజిత్రెడ్డి, ఎంఎల్సీ పట్నం మహేందర్రెడ్డి, ప్రభుత్వ అధికారులు, అమరరాజా బ్యాటరీస్ ఉన్నతోద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
‘బ్యాటరీల తయారీకి అనువైన ఎకోసిస్టమ్ ఏర్పాటుకు ప్రభుత్వాల మద్దతు చాలాచాలా అవసరమని, అటు డిమాండ్, ఇటు సరఫరాపరంగా నిర్దిష్టమైన ప్రణాళికలుండాలి అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎంతో ముందుచూపుతో వ్యవహరిస్తున్నదని చెప్పారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ మొబిలిటీ వ్యాలీని తీసుకొచ్చామన్నారు. అమరరాజాతో తెలంగాణ మొబిలిటీ వ్యాలీకి విశిష్ఠ స్థానం దక్కుతున్నదని తెలిపారు. ఎలక్ట్రిక్ వెహికిల్స్, అడ్వాన్స్డ్ సెల్ కెమిస్ట్రీ, బ్యాటరీలు, హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్స్ అండ్ ఇంజినీరింగ్-రిసెర్చ్ ఫెసిలిటీస్ అనే నాలుగు క్లస్టర్లతో వ్యాలీ ఎలక్ట్రిఫికేషన్ హబ్గా మారగలదని అన్నారు. ఇక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కావాల్సిన పర్యావరణ అనుమతులు వచ్చేశాయని, దీంతో సాగునీటి అవసరాలకేగాక పారిశ్రామిక వినియోగానికీ పుష్కలంగా నీటిని సరఫరా చేసుకోవచ్చని తెలిపారు.
జీఎంఆర్ ఏరోసిటీలో అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ నిర్మిస్తున్న అడ్వాన్స్డ్ ఎనర్జీ రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ దేశంలోనే తొలి ఎనర్జీ పార్క్. ఇక్కడ గరిష్ఠంగా 16 గిగావాట్, 5 గిగావాట్ సామర్థ్యం వరకు లిథియం సెల్స్, బ్యాటరీ ప్యాక్లు తయారు కానున్నాయి. ఈ సందర్భంగా నేటి అడ్వాన్స్డ్ బ్యాటరీ టెక్నాలజీస్పై ‘ఇవాల్వ్’ కాంక్లేవ్నూ అమరరాజా బ్యాటరీస్ నిర్వహించింది. కాగా, గతంలో ప్రకటించిన రూ.9,500 కోట్ల ‘గిగా కారిడార్’లో భాగంగానే ఈ ల్యాబ్ను అమరరాజా బ్యాటరీస్ తీసుకొస్తున్నది. కారిడార్ ఏర్పాటులో ఇదో కీలక మైలురాయిగా సంస్థ ఈ సందర్భంగా అభివర్ణించింది. అడ్వాన్సింగ్ కటింగ్-ఎడ్జ్ ఎనర్జీ సొల్యూషన్స్లో ఈ సెంటర్ ప్రధాన పాత్ర పొషించగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. వచ్చే పదేండ్లలో అందుబాటులోకి రానున్న ఈ కారిడార్తో దాదాపు 9వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యో గ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.
అమరరాజా బ్యాటరీస్ అంకితభావానికి అద్దం పడుతుంది. భవిష్యత్తు ఎనర్జీ అవసరాల దృష్ట్యా.. ఈ ల్యాబ్ సరికొత్త పరిష్కారాలను చూపగలదు. రాబోయే నూతన టెక్నాలజీలను అందిపుచ్చుకుంటూ ఈ రంగంలో అభివృద్ధికి బాటలు వేస్తాం’
-జయదేవ్ గల్లా, అమరరాజా గ్రూప్ సీఎండీ