హైదరాబాద్, ఆగస్టు 15(నమస్తే తెలంగాణ): అన్ని రకాల మౌలిక సదుపాయాలతో కూడిన పారిశ్రామికవాడల్లో పరిశ్రమల ఏర్పాటునకు సంబంధించి టీఎస్ఐఐసీ ఆహ్వానం పలుకుతున్నది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమకు నచ్చిన రంగాల్లో, తమకు అనుకూలమైన జిల్లాల్లో పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుతున్నది. ఆయా జిల్లాల్లోని పారిశ్రామికవాడల్లో ఉన్న ఖాళీ స్థలాలను ఎంపికచేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం ఐటీ, ఫార్మాతోపాటు టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఇంజినీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్ తదితర రంగాల్లో పెట్టుబడులను ఆకట్టుకోవడానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తున్న విషయం విధితమే. ఇందులో భాగంగానే టీఎస్ఐఐసీ ఆయా రంగాలవారీగా రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి, సంగారెడ్డి తదితర రాజధాని శివారు జిల్లాలతోపాటు ఇతర జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున పారిశ్రామికవాడలను అభివృద్ధి చేసింది. ఇప్పటికే చాలా వరకు కేటాయింపులు కూడా పూర్తవగా, ఆయా సంస్థలు ఉత్పత్తిని కూడా ఆరంభించాయి. అయితే, ఇంకా కొన్నిచోట్ల ఖాళీ స్థలాలు మిగలడంతో ఔత్సాహికులు ముందుకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలతోపాటు టీ-ప్రైడ్, టీ-ఐడియా వంటి పథకాల ద్వారా లబ్దిపొందే అవకాశముందని అధికారులు తెలిపారు. ఆయా జిల్లాల్లో పరిశ్రమల శాఖను సంప్రదించి ఆయా రంగాలవారీగా ఉన్న ఖాళీప్లాట్ల వివరాలు తెలుసుకోవడంతోపాటు నేరుగా వాటిని సందర్శించవచ్చని పేర్కొన్నారు. తమకు అనుకూలంగా ఉంటే నిర్ణీత మొత్తం చెల్లించి స్థలాన్ని స్వాధీనం చేసుకోవచ్చని వివరించారు.