హైదరాబాద్: ఆసియాలో అతిపెద్ద డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ ఇండియాజాయ్కు తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. నవంబర్ 16 నుంచి 19 వరకు వర్చువల్గా ఇది జరుగనున్నది. ఎస్స్పోర్ట్స్, స్కిల్ గేమింగ్ ప్లాట్ఫాం మొబైల్ ప్రీమియర్ లీగ్ (MPL), ఇండియాజాయ్ 2021కు స్పాన్సర్గా వ్యవహరిస్తున్నది. ఈ వార్షిక ఈవెంట్ను తెలంగాణ వర్చువల్ యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ (TVAGA) నిర్వహిస్తున్నది.
డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ నాల్గవ ఎడిషన్.. వ్యాపారాలు, వ్యాపార నాయకులు, కంటెంట్ సృష్టికర్తలు, గేమింగ్, యానిమేషన్, డిజిటల్ మీడియా, వినోద రంగాలలోని నిపుణులను ఒకచోట చేర్చుతుంది. VFX, OTT పల్స్, ఇన్ఫ్లుయెన్సర్ కాన్ఫరెన్స్, దేశిటూన్స్ వంటివి ఇందులో మిళితమై ఉంటాయి.
గత మూడు ఎడిషన్లలో ఆసియాలో AVGC రంగాన్ని పెంచడంలో ఇండియాజాయ్ గణీయమైన పాత్ర పోషించిందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. గ్లోబల్ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఒక ముఖ్యమైన కేంద్రంగా హైదరాబాద్ నగరానికి వెలుగునివ్వడానికి ఇది సహాయపడిందని చెప్పారు. 2023 నాటికి మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగం సమ్మేళన వార్షిక వృద్ధి రేటు (CAGR) 13.7 శాతానికి పెరిగి రూ.2.23 ట్రిలియన్ డాలర్లకు (30.6 బిలియన్ డాలర్లు) చేరుకుంటుందని అంచనా వేశారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం, స్వీకరణ, అనుసరణను ప్రోత్సహించడానికి అవసరమయ్యే కొత్త డిజిటల్ వినోద విప్లవాన్ని ఉపయోగించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. విజయానికి దోహదపడే అగ్రగామి సాంకేతికతను ప్రోత్సహించడానికి బలమైన పర్యావరణ వ్యవస్థ ఏర్పాటుతోపాటు మౌలిక సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. యానిమేషన్, VFX, OTT, గేమింగ్తో కూడిన ఇండియాజాయ్ వంటి గ్లోబల్ స్కేల్ ఈవెంట్స్, ఇమేజ్ టవర్స్ వంటి ఈ చర్యలు దేశంతోపాటు హైదరాబాద్లో ఈ రంగం వృద్ధిని ప్రోత్సహించాయని వివరించారు. ప్రపంచం ప్రతి ఏటా ఎదురుచూసే ఈవెంట్గా ఇండియాజాయ్ని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని అన్నారు.
సృజనాత్మక టెక్, డిజిటల్ రంగంలో (AVGC సెక్టార్) భారతదేశం ఇటీవల అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమలు, వాణిజ్యం విభాగాల ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. 2024 నాటికి ఈ రంగం వృద్ధి రూ.3 లక్షల కోట్లు (సుమారు 44 బిలియన్ డాలర్ల)కు చేరవచ్చని అంచనా వేశారు. ఈ రంగంలో అభివృద్ధికి కేంద్ర బిందువుగా హైదరాబాద్ ఉందని, ఈ వ్యవస్థను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తున్నదని చెప్పారు. ‘ఇప్పుడు మేము వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఉన్నాం. ఇండియాజాయ్ వంటి మెగా ఈవెంట్కు మద్దతు కొనసాగించడం ద్వారా చాలా వ్యూహాత్మక విలువను కలిగి ఉన్నాం’ అని ఆయన పేర్కొన్నారు.
బెంగుళూరు తర్వాత అతిపెద్ద గేమింగ్ గమ్యస్థానంగా హైదరాబాద్ అవతరించిందని మొబైల్ ప్రీమియర్ లీగ్ (MPL) సహ వ్యవస్థాపకులు, సీఈవో సాయి శ్రీనివాస్ తెలిపారు. ఇండియాజాయ్ వంటి ఈవెంట్ వాటాదారులను ఒక తాటిపైకి తీసుకువస్తుందని, ఈ రంగంలో స్థిరత్వాన్ని మరింత పెంచుతుందని అన్నారు. మొబైల్ గేమింగ్, ఎస్స్పోర్ట్స్ ల్యాండ్స్కేప్ని భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విప్లవాత్మకంగా మార్చడంపై తాము దృష్టిసారించినట్లు చెప్పారు. ఈ రంగంలో తమ అనుభవాన్ని పంచుకోవడానికి, పరిశ్రమను ముందుకు నడిపించే ఆలోచనలను లోతుగా పరిశోధించడానికి ఎదురుచూస్తున్నట్లు వివరించారు.
ఈ ఏడాది నవంబర్ 16 నుంచి 19 వరకు నిర్వహించే ఇండియాజాయ్లో సుమారు 50కిపైగా దేశాలకు చెందిన 500 మందికిపైగా ప్రతినిధులు,18,000 మందికిపైగా ఔత్సాహికులు పాల్గొంటున్నట్లు ప్రోగ్రామ్ డైరెక్టర్ సునీల్ చక్రవర్తి తెలిపారు. 200 ట్రాక్లు, 100 ప్యానెల్ చర్చలను ఇప్పటికే ధృవీకరించామన్నారు. గతం కంటే ఈ సారి రెండున్నర రెట్లు ఎక్కువగా ఔత్సాహికులు పాల్గొనబోతున్నట్లు ఆయన చెప్పారు. ఫుల్ జోష్ అండ్ జాయ్తో కూడిన ఈ వర్చువల్ రియాలిటీ ఈవెంట్ భౌతికంగా నిర్వహించే అంతర్జాతీయ ఈవెంట్కు ఏ మాత్రం తీసిపోదని అన్నారు.