‘Treda’ Property Show | తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) వచ్చేనెల ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో 11వ ట్రెడా ప్రాపర్టీ షో నిర్వహిస్తారు. ఈ ప్రాపర్టీ షోలో 100 మందికి పైగా డెవలపర్స్, బిల్డర్లు, ప్రమోటర్లు, బిల్డింగ్ మెటీరియల్ సప్లయర్స్, ఆర్థిక సంస్థలు పాల్గొంటున్నాయి. పండుగల సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే కస్టమర్లకు విస్తృత శ్రేణి ఆఫర్లను అందుబాటులోకి తేనున్నాయి.
వివిధ సామాజిక వర్గాలు, కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా అపార్ట్మెంట్లతోపాటు విల్లాలు, ప్లాట్లను రియల్ ఎస్టేట్ సంస్థలు ఈ ప్రాపర్టీ షోలో ప్రదర్శించనున్నాయి. 800 చదరపు అడుగుల నుంచి 10 వేల చదరపు అడుగుల పై చిలుకు ఎస్ఎఫ్టీ వరకు గల ఇండ్లు సొంతింటి కొనుగోలు దారులకు అందుబాటులోకి రానున్నాయి. రూ.30 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు ధరలు పలుకుతున్నాయి. రూ.25-30 లక్షల్లోపు నుంచి రూ.30-45 లక్షల్లోపు గల చౌక ఇండ్ల ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి.
ఎస్బీఐతోపాటు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఐఐఎఫ్ఎల్ హోం ఫైనాన్స్, కెనరా బ్యాంక్ సహా 10కి పైగా ఆర్థిక సంస్థలు సొంతింటి కొనుగోలుదారులకు త్వరితగతిన ఇంటి రుణాలు పొందేందుకు ఆఫర్లు తీసుకొస్తున్నాయి.
తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) అధ్యక్షుడు ఆర్ చలపతిరావు మాట్లాడుతూ.. హైదరాబాద్లో ఇటీవలి కాలంలో రిమార్కబుల్ పురోగతి సాధించాం.. పండుగల సీజన్లోకి అడుగు పెడుతున్నాం. ఇల్లు కొనుగోలు కోసం పెట్టుబడి పెట్టాలని ప్రణాళిక రూపొందించే ప్రతి ఒక్కరికీ ఇది సరైన టైం. దీనివల్ల స్వల్పకాలిక మాత్రమే కాక దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూరుతుంది అని అని చెప్పారు.
2020 ప్రారంభం నుంచి కొవిడ్-19 మహమ్మారి మనపై తీవ్ర ప్రభావం చూపింది. తొలి, సెకండ్ వేవ్ వేళ మహమ్మారిని నియంత్రించడానికి లాక్డౌన్ విధించారు. నాటి నుంచి ప్రస్తుత్తం ఇమ్యూనైజేషన్ (వ్యాక్సినేషన్) ప్రక్రియ వేగం పుంజుకుంటున్నది. రియల్ ఎస్టేట్తోపాటు ప్రతి పారిశ్రామిక రంగం కార్యకలాపాలు సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయని చలపతి రావు పేర్కొన్నారు.