ప్రి-బడ్జెట్ సమావేశంపై ట్రేడ్ యూనియన్ల మండిపాటు
న్యూఢిల్లీ, డిసెంబర్ 18: బడ్జెట్ ముందస్తు సంప్రదింపుల సమావేశాన్ని సరైన రీతిలో నిర్వహించలేదంటూ కేంద్ర ఆర్థిక శాఖను ట్రేడ్ యూనియన్లు దుమ్మెత్తిపోశాయి. బడ్జెట్ ముందస్తు చర్చలకు హాజరయ్యే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం వర్చువల్గా జరిగిన ఈ సమావేశానికి గైర్హాజరవడంపై యూనియన్లు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తంచేసాయి. ఈ సమావేశం సెంట్రల్ ట్రేడ్ యూనియన్లకు (సీటీయూలు) అవమానకరమని పేర్కొన్నాయి. ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి అధ్యక్షతన 1 గంట 15 నిముషాలు జరిగిన ఈ వర్చువల్ ప్రి-బడ్జెట్ సమావేశం మంత్రిత్వ శాఖ తమను పరిహాసం చేసినట్టు ఉందని విమర్శించాయి.
‘పరిశ్రమల ప్రతినిధులు ఎందుకు?’
సమావేశానికి ఆర్థిక మంత్రి సీతారామన్ తమను ఆహ్వానించి, తాను హాజరుకాకపోవడం విచారకరమని బీఎంఎస్ ప్రధాన కార్యదర్శి బినోయ్ కుమార్ సిన్హా అన్నారు. ‘సహాయ మంత్రి, ఆర్థిక శాఖ అధికారులు మాత్రమే హాజరయ్యారు. సీఐఐ, ఫిక్కీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఇది ట్రేడ్ యూనియన్లకు అవమానం’ అని సిన్హా చెప్పారు.
మాట్లాడుతుంటే కనెక్షన్ కట్
మంత్రిత్వ శాఖ దృష్టిలో ట్రేడ్ యూనియన్లంటే చులకనగా ఉందని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ అన్నారు. 14 ట్రేడ్ యూనియన్లను ఆహ్వానించి, మధ్యాహ్నం 3 గంటల నుంచి 4.15 వరకూ సమయాన్ని నిర్ణయించారని, ఒక్కొక్కరికీ 3 నిముషాల సమయం ఇచ్చారని, కార్మికుల పట్ల ప్రభుత్వం చూపుతున్న వివక్షను ప్రస్తావిస్తుంటే వర్చువల్ మీట్ కనెక్షన్ కట్ అయ్యిందని కౌర్ వివరించారు. తక్షణమే భౌతిక సమావేశాన్ని అధిక సమయంపాటు ఏర్పాటు చేయాలని హింద్ మజ్దూర్ సభ ప్రధాన కార్యదర్శి హర్భజన్ సింగ్ సంధు డిమాండ్ చేశారు.