న్యూఢిల్లీ: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్ (పీఎంసీ)ని టేకోవర్ చేసేందుకు సెంట్రం అండ్ భారత్ పే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇచ్చిన ఆఫర్కు ఆర్బీఐ ఆమోదం తెలిపింది. కానీ ఆర్బీఐ ఎనిమిదేండ్ల క్రితం వచ్చిన ఫిర్యాదులపై అటెన్షన్ పెట్టి ఉంటే పెద్ద స్కామ్ జరిగేది కాదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్బీఐలో అధికారిగా పని చేసిన వ్యక్తే.. పీఎంసీ జనరల్ మేనేజర్గా విధులు నిర్వర్తించడం ఆసక్తికర పరిణామం.
పీఎంసీ బ్యాంకులో కుంభకోణం జరుగుతున్నదన్న సంకేతాలు ఆర్బీఐకి చాలా కాల క్రితమే వచ్చాయి. సెంట్రల్ బ్యాంక్ సకాలంలో స్పందించి ఉంటే పరిస్థితులు విషమించేవి కావని తెలుస్తున్నది.
2011 జనవరి 28న పీఎంసీ బ్యాంక్ ఎంప్లాయి ఒకరు అప్పటి ఆర్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్కు లేఖ రాశారు. హెచ్డీఐఎల్, డీహెచ్ఎఫ్ఎల్ సంస్థలతో బ్యాంకు లావాదేవీలు సందేహస్పదంగా ఉన్నాయని అందులో పేర్కొన్నారు.
హెచ్డీఐఎల్, డీహెచ్ఎఫ్ఎల్ సంస్థలు రెండూ వాద్వాన్ కుటుంబానివే. హెచ్డీఐఎల్ డిపాజిట్ల విషయమై ఆ సంస్థకు పీఎంసీ బ్యాంకు సహకరించిందని ఆ బ్యాంకు ఉద్యోగి పేర్కొన్నారు.
హెచ్డీఐఎల్ బ్లాక్ మనీ మొత్తం పీఎంసీ బ్యాంక్లో క్యాష్ డిపాజిట్లుగా చూపించారు. క్యాష్ లిమిట్ పెంపు విషయం ఆర్బీఐకి తెలుపలేదు.
పీఎంసీ బ్యాంకు ఉద్యోగి ఫిర్యాదు మేరకు 2011 మార్చి ఏడో తేదీన ఆ బ్యాంక్ సీఈవోను విచారణకు ఆదేశించింది ఆర్బీఐ. కానీ ఆ సీఈవో స్కామ్ స్టర్లతో కలిసిపోయి, కుట్రకు పాల్పడ్డారు. తర్వాత ఈ కేసులో సదరు పీఎంసీ బ్యాంకు సీఈవో అరెస్టయ్యారు.
పీఎంసీలో అవకతవకలను గుర్తించడంలో అడిటర్లు విఫలమయ్యారు. దీనికి తోడు సదరు బ్యాంకుకు టాప్ రేటింగ్ ఇచ్చారు. బ్యాంక్ అడిటర్ లక్డావాలా పాత్ర కూడా విచారణ జరిపారు.
పీఎంసీ మొండి బాకీలు 9 శాతానికి చేరుకున్నాయి. కానీ బ్యాంకు ఒక్కశాతమే ఉన్నాయని రికార్డు చూపింది. పీఎంసీ బ్యాంకులో రూ.250 కోట్లు ఉన్నట్లు బోగస్ డిపాజిట్లు చూపారు. ఫేక్ డిపాజిట్లు పెంచేశారు.
మరోవైపు మొండి బకాయి కంపెనీలైన డీహెచ్ఎఫ్ఎల్, హెచ్డీఐఎల్లకు తాజాగా రుణాలిచ్చింది పీఎంసీ. ఈ కంపెనీల డైరెక్టర్లు, భాగస్వాములు, బంధువుల పేరిట పుష్కలంగా రుణాలిచ్చింది.
ఆర్బీఐ నిబంధనల ప్రకారం అందులో పని చేసిన రిటైర్డ్/ రాజీనామా చేసిన అధికారులు ప్రైవేట్ బ్యాంకుల్లో పని చేయకూడదు. ఆర్బీఐలో పని చేసిన ఎల్ఎన్ కాంబ్లే మాత్రం పీఎంసీ జనరల్ మేనేజర్గా చేరారు. ఆర్బీఐలో కో ఆపరేటివ్ బ్యాంకుల విభాగాన్ని కుంబ్లే పర్యవేక్షించడం గమనార్హం.
ఆర్బీఐలో 2012 జనవరిలో రిటైరైన ఎల్ఎన్ కాంబ్లే అదే ఏడాది మార్చిలో పీఎంసీ జనరల్ మేనేజర్గా నియమితులయ్యారు. పీఎంసీకి వెళ్లడానికి ఆర్బీఐ ఆమోదం కూడా పొందారు. పీఎంసీ హెచ్ఆర్ అండ్ ట్రైనింగ్ విభాగంలో పని చేశారు. 2019 అక్టోబర్లో రాజీనామా చేశారు.
పీఎంసీ బ్యాంక్ సీఈవో జాయ్ థామస్ వ్యవహార శైలి మరింత వివాదాస్పదమైంది. పర్సనల్ అసిస్టెంట్ను పెండ్లాడటానికి తన మతాన్ని మార్చుకున్నారు. తన భార్యకు పుణెలో 9 ఫ్లాట్లు గిఫ్ట్గా ఇవ్వడం గమనార్హం.
2019 సెప్టెంబర్లో కుంభకోణం వెలుగు చూసింది. నాటి నుంచి దాని లావాదేవీలపై విధించిన ఆంక్షలను తాజాగా ఆర్బీఐ వచ్చే డిసెంబర్ వరకు పొడిగించింది. ఈ బ్యాంకును టేకోవర్ చేసేందుకు సెంట్రం-భారత్ పే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దాఖలు చేసిన బిడ్ను ఆర్బీఐ ఆమోదించింది.