Airbus Chopper | ఒక్కసారైనా విమానయానం చేయాలని ప్రతి ఒక్కరి కల.. వీలైతే ఓ బుల్లి విమానం.. లేదా హెలికాప్టర్కు యజమాని కావాలనే కోరిక ఉంటుంది.. ఆ కోరికతోనే సరిపోదు.. అందుకు దండిగా సొమ్ములుండాలి. అలా డబ్బు సంపాదించిన మలయాళీ బిలియనీర్ బీ రవి పిళ్లై తొలిసారి అత్యంత విలాసవంతమైన హెలికాప్టర్ సొంతం చేసుకున్నారు. సుమారు రూ.100 కోట్ల విలువ గల ఈ హెలికాప్టర్ను ఎయిర్బస్ ఆదివారం కేరళలోని కొవలంలో డెలివరీ చేసింది. ఆర్పీ గ్రూప్ సంస్థలకు చైర్మన్ బీ రవి పిళ్లై. ఆయన వ్యక్తిగత నికర సంపద ప్రస్తుతం 2.5 బిలియన్ల డాలర్లు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆవల వివిధ కంపెనీల్లో రవి పిళ్లై 70 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1,500 హెచ్ 145 ఎయిర్క్రాఫ్ట్లు పని చేస్తున్నాయి.
భారత్లో ఇంత విలాసవంతమైన హెలికాప్టర్ ఎయిర్బస్ హెచ్ 145 సొంతం చేసుకున్న తొలి ఇండియన్గా రవి పిళ్లై నిలిచారు. ఇద్దరు పైలట్లతోపాటు ఏడుగురు ప్యాసింజర్లను తీసుకెళ్లగల సామర్థ్యం ఉన్న ఈ హెలికాప్టర్ కొవళం నుంచి రావిజ్ అష్టముడి వరకు తొలిసారి ప్రయాణం చేసింది. ఇది సముద్ర జలాల నుంచి 20 వేల అడుగుల ఎత్తున ల్యాండింగ్.. టేకాఫ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. అత్యాధునిక వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్తో ఈ హెచ్145 హెలికాప్టర్ పని చేస్తుంది.
కేరళలో పర్యాటక రంగం అభివృద్ధికి తాను సొంతం చేసుకున్న న్యూ ఎయిర్బస్ హెలికాప్టర్తో రవి పిళ్లై సేవలందించనున్నారు. కేరళ అంతటా ఆయనకు విలాసవంతమైన హోటళ్లు ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రదేశాలకు అతిథులను చేరవేయడానికి ఈ హెలికాప్టర్ ఉపకరిస్తుంది. కేరళలో పర్యాటక రంగ అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని గత నెలలో రవి పిళ్లై చెప్పారు. చైనాలో మాదిరిగా కేరళలోనూ దరఖాస్తు చేసిన రెండు నెలల్లో హెలికాప్టర్ సేవలను ప్రారంభించడానికి అనుమతి ఇస్తే బాగుంటుందన్నారు. కేరళ ప్రభుత్వం నాలుగు సెగ్మెంట్ల అభివృద్ధిపై ఫోకస్ చేసింది. నాలెడ్జ్ బేస్డ్ బిజినెస్, హెల్త్కేర్, టూరిజం, రబ్బర్ బేస్డ్ ఇండస్ట్రీలపై దృష్టి కేంద్రీకరించింది