ముంబై, మే 18: ప్రపంచ మార్కెట్లో డాలరు బలపడటం, దేశీ ఈక్విటీ మార్కెట్ వరుస క్షీణతను చవిచూడటం తదితర అంశాలతో రూపాయి విలువ హఠాత్తుగా పతనమవుతున్నది. గురువారం ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో డాలరు మారకంలో రూపాయి విలువ 25 పైసలు కోల్పోయి 82.62 వద్ద ముగిసింది. ఇది ఇంట్రాడేలో 82.66 స్థాయిని తాకింది. క్రితం రోజు 12 పైసల మేర నష్టాన్ని చవిచూడటంతో వరుసగా రెండ్రోజుల్లో 34 పైసలు తగ్గినట్టయ్యింది. రెండు వారాల క్రితం 81.75 స్థాయివరకూ బలపడిన తర్వాత రూపాయి క్రమేపీ క్షీణిస్తున్నది.
ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ 100.50 స్థాయి నుంచి క్రమేపీ పెరుగుతూ గురువారం 103 స్థాయికి చేరింది. అమెరికా ప్రభుత్వం రుణ పరిమితిని పెంచి, చెల్లింపుల డిఫాల్ట్ను నివారించేందుకు రిపబ్లికన్లతో డీల్ కుదిర్చేందుకు జరుగుతున్న చర్చల పట్ల ఆశాభావంతో డాలరు పెరుగుతున్నదని ఫారెక్స్ డీలర్లు చెప్పారు. డాలర్ ఇండెక్స్ ఏడు వారాల గరిష్ఠానికి చేరిందని బీఎన్పీ పారిబా రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి తెలిపారు. అలాగే బీఎస్ఈ సెన్సెక్స్ గురువారం 129 పాయింట్లు నష్టపోగా, ఇది మూడు రోజులపాటు వరుస క్షీణతను చవిచూసింది. ఈ నేపథ్యంలో వచ్చే కొద్దిరోజులపాటు రూపాయి ప్రతికూలంగానే ట్రేడవుతుందని, కనిష్ఠస్థాయిల్లో దేశీయ కరెన్సీకి మద్దతు లభించవచ్చని అనూజ్ అంచనా వేశారు.