హైదరాబాద్, సెప్టెంబర్ 12: దేశీయ ఫార్మా ఎగుమతులకు ధరల సెగ గట్టిగానే తగులబోతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫార్మా ఎగుమతుల్లో వృద్ధి 10 శాతానికి పరిమితం కానున్నదని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఫార్మాగ్జిల్) డైరెక్టర్ జనర్ రవి ఉదయ్ భాస్కర్ తెలిపారు. తనిఖీలు, ధరల ఒత్తిడి, అంతర్జాతీయ సరఫరాల్లో అంతరాయం ఏర్పడటంతో ఈ ఏడాది ఎగుమతులపై ప్రభావం పడనున్నదని పేర్కొన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 24 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఔషధాలు ఎగుమతి అయ్యాయి.
కేంద్ర పరిశ్రమలు, ఆరోగ్య మంత్రిత్వశాఖల సహకారంతో ఫార్మా అండ్ హెల్త్కేర్కు సంబంధించిన ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ ఆఫ్ ఫార్మా అండ్ హెల్త్కేర్ (ఐపెక్స్) ఎనిమిదోవ అంతర్జాతీయ ప్రదర్శన ఈ నెల 21నుంచి 23 వరకు నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్లో జరగనుందని ఐపెక్స్ చైర్మన్ డా. సీ సత్యనారాయణ తెలిపారు. ఇందులో 350 మంది భారతీయ ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నట్లు, 50 కన్నా ఎక్కువ దేశాలనుంచి 700కిపైగా కొనుగోలుదారులు, వివిధ దేశాలకు చెందిన రెగ్యులేటరీ సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.
ఫార్మా రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి రాష్ట్ర సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ముచ్చర్లలో అభివృద్ధి చేస్తున్న ఫార్మా సిటీతో ఫార్మా రంగానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భాస్కర్ తెలిపారు. ఈ ఫార్మా సిటీతో దేశీయ ఔషధాల వినిమయంతోపాటు ఎగుమతులు కూడా మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.