ఫెడ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు సన్నగిల్లడం, కమోడిటీ ధరలు తగ్గడం, ద్రవ్యోల్బణం దిగిరావడం తదితర సానుకూలాంశాల నేపథ్యంలో గత వారం మార్కెట్ ర్యాలీ జరపగలిగింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 245 పాయింట్ల లాభంతో 18,314 పాయింట్ల వద్ద ముగిసింది. ట్రెండ్ పాజిటివ్గా ఉన్నప్పటికీ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవ్వడం, అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో చిక్కుకుంటుందన్న భయాలు తలెత్తడంతో ఈ వారం స్టాక్ సూచీలు దీంతో విస్త్రత శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనుకావచ్చని విశ్లేషకులు చెపుతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో చిన్నపాటి కరెక్షన్ జరగవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ అంచనా వేశారు. భారీ తగ్గుదల ఉండకపోవచ్చని స్వస్తికా ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా చెప్పారు. ఈ నేపథ్యంలో నిఫ్టీ 17,800-18,500 పాయింట్ల విస్త్రత శ్రేణిలో ట్రేడ్ అవుతుందని టెక్నికల్ చార్టులు సూచిస్తున్నట్టు విశ్లేషకులు వివరించారు.
ఈ వారం కరెక్షన్ జరిగితే 18,200-18,000 పాయింట్ల శ్రేణి మధ్య కీలకమైన మద్దతు లభిస్తున్నదని మెజారిటీ టెక్నికల్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. 18,200 పాయింట్ల స్థాయిని నిలుపుకుంటే మే నెల డెరివేటివ్ ముగింపులోపు 18,500-18,600 శ్రేణి వరకూ పెరగవచ్చని సామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమిత్ మోది చెప్పారు. 18,200 మద్దతును కోల్పోతే 18,000, 17,850 పాయింట్ల వరకూ తగ్గవచ్చని అన్నారు. ఈ వారం నిఫ్టీ 18,150 పాయింట్ల స్థాయిని కోల్పోతే మార్కెట్ క్షీణబాట పడుతుందని, 18,500 వద్ద అవరోధం కలగవచ్చని యాక్సిస్ సెక్యూరిటీస్ విశ్లేషకుడు పాల్వియా అంచనా. 18,195 దిగువన 17,800 వర కూ క్షీణించవచ్చని, 18,500 స్థాయి నిరోధించవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్స్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ పేర్కొన్నారు.