Zee entertainment | జీ ఎంటర్టైన్మెంట్ శనివారం బాంబే హైకోర్టు తలుపు తట్టింది. సోనీలో జీ టీవీ విలీనానికి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో అసాధారణ వార్షిక సమావేశం (ఈజీఎం) నిర్వహించాలని ఇన్వెస్టర్లు ఇన్వెస్కో, ఓఎఫ్ఐ గ్లోబల్ చైనా ఫండ్ ఎల్ఎల్సీ డిమాండ్ చేస్తున్నాయి. అలాగే జీ ఎంటర్టైన్మెంట్ ఎండీ పునీత్ గోయెంకాను తొలగించడంతోపాటు పలు అంశాలపై చర్చించడానికి ఏజీఎం జరుపాలని పట్టుబడుతున్నారు. కానీ జీ ఎంటర్టైన్మెంట్ ఎండీగా పునీత్ గోయెంకా తొలగించాలన్న ఇన్వెస్టర్ల డిమాండ్ తప్పిదం అని సంస్థ పేర్కొంది. ఇన్వెస్కో, ఎల్ఎల్సీ ప్రతిపాదనకు వ్యతిరేకంగా జీ ఎంటర్టైన్మెంట్.. హైకోర్టు తలుపు తట్టింది.
ఏజీఎం నిర్వహించే అంశాన్ని పరిశీలించాలన్న ఎన్సీఎల్టీ ఆదేశాలు జారీ చేసిన తర్వాత శుక్రవారం జరిగిన జీ ఎంటర్టైన్మెంట్ బోర్డు సమావేశంలో సంస్థ, వాటాదారుల ప్రయోజనాల నిమిత్తం ఏజీఎం నిర్వహించబోవడం లేదని రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. న్యాయ సలహా మేరకు నిర్ణయం తీసుకుంటామని వివరించింది. ఈ సమావేశానికి ఎండీ కం సీఈవో పునీత్ గోయెంకా హాజరు కాలేదు.
ఈజీఎం నిర్వహణకు జీ ఎంటర్టైన్మెంట్ను ఆదేశించాలని ఇన్వెస్కో దాఖలు చేసిన పిటిషన్పై ఎన్సీఎల్టీ సోమవారం విచారణ జరిపే అవకాశం ఉంది. ఇన్వెస్కోకు వాటాదారులు మద్దతు తెలిపితే, జీ ఎంటర్టైన్మెంట్ ఎండీ పునీత్ గోయెంకా అనివార్యంగా ఈజీఎం నిర్వహించాల్సిందే. అదే జరిగితే సోనీ పిక్చర్స్లో జీ విలీన ఒప్పందంపై ప్రతిష్ఠంభన నెలకొంటుంది.
నిబంధనల ప్రకారం ఒక కంపెనీలో 10 శాతానికి పైగా వాటాలు ఉన్న ఇన్వెస్టర్లు.. ఏజీఎం నిర్వహించాలని సంస్థ యాజమాన్యానికి నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నోటీసు ఇచ్చిన మూడు వారాల్లో ఏజీఎం నిర్వహించాలి. జీ ఎంటర్టైన్మెంట్లో ఇన్వెస్కోలో 18 శాతం వాటా ఉంది. కార్పొరేట్ గవర్నెన్స్ నిబంధన కింద ఈజీఎం నిర్వహించాలని ఇన్వెస్కో డిమాండ్ చేస్తోంది.
ఇంతకుముందు జీ ఎంటర్టైన్మెంట్ యాజమాన్యానికి ఈజీఎం నిర్వహణపై ఇన్వెస్కో గత నెల 11న నోటీసు జారీ చేసింది. అది సెప్టెంబర్ 12న జీ ఎంటర్టైన్మెంట్కు చేరింది. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు (అక్టోబర్ 2)న ఈజీఎం నిర్వహించాలి. ఒకవేళ జీ ఎంటర్టైన్మెంట్ ఈజీఎం నిర్వహణ తేదీ ప్రకటించకపోతే ఇన్వెస్కో వెల్లడించే అవకాశం ఉంది.
ఈజీఎం నిర్వహించాలని ఇన్వెస్కో నోటీసు ఇచ్చిన రోజే ఇద్దరు స్వతంత్ర డైరెక్టర్లు రాజీనామా చేశారు. గత నెల 22న సోనీ పిక్చర్స్లో విలీనం అవుతున్నట్లు ప్రకటించారు. ఈ విలీనం ఒప్పందం 90 రోజుల్లో పూర్తి కావాల్సి ఉంటుంది. ఇన్వెస్కో డిమాండ్ మేరకు జీ ఈజీఎం సమావేశం నిర్వహించి, మెజారిటీ వాటాదారులు ఎండీ పునీత్ గోయెంకా, బోర్డుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే కష్టాలు మొదలైనట్లే. కొత్తగా ఏర్పాటయ్యే బోర్డు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.