(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): ఎన్నో టెక్ స్టార్టప్లకు బాసటగా నిలిచిన అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ), సిగ్నేచర్ బ్యాంక్లు పతనమవ్వడం అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థనే కాకుండా యావత్తు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నది. 2008 నాటి లేమన్ బ్రదర్స్ స్థాయి సంక్షోభం మరోసారి తలెత్తవచ్చని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలో కేంద్ర ఐటీశాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖరన్ చేసిన ప్రకటన తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది. దివాలా తీసిన ఎస్వీబీలో వందలాది దేశీయ స్టార్టప్ కంపెనీలకు 1 బిలియన్ డాలర్లకు (రూ. 8,265 కోట్లు) పైగా డిపాజిట్లు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. ఈ నేపథ్యంలో స్థానిక బ్యాంకులు స్టార్టప్ సంస్థలకు రుణాలిచ్చేందుకు ముందుకు రావాలని సూచించారు. ఎస్వీబీలో ఉన్న డిపాజిట్ల ఆధారంగా భారత బ్యాంకులు ఆయా స్టార్టప్లకు రుణాలను మొత్తాన్ని సమకూర్చాలని చెప్పారు.
మంత్రి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2015లో ప్రధాని నరేంద్రమోదీ ఆర్భాటంగా ప్రకటించిన ‘స్టార్టప్ ఇండియా’ పథకం అట్టర్ ఫ్లాప్గా మారింది. కేంద్రప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కొరవడటం, నిధుల కేటాయింపులు తగ్గడంతో.. బయటి నుంచి పెట్టుబడులను రాబట్టడంలో అయా స్టార్టప్లు విఫలమవుతున్నాయి. మరోవైపు, ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది.
బ్యాంకుల విలీనం, శాఖల కుదింపుతో ఖర్చులను తగ్గించుకొనే చర్యలను ప్రభుత్వం ఎప్పుడో మొదలెట్టింది. ప్రైవేటీకరణ పేరిట ప్రభుత్వ బ్యాంకులను నిర్వీర్యం చేసిన కేంద్ర సర్కారు.. ఇప్పుడు స్టార్టప్లను ఆదుకోవాలంటూ బ్యాంకులను కోరడమేంటని ప్రశ్నిస్తున్నారు. ‘స్టార్టప్ ఇండియా’ కోసం కేటాయించిన నిధులను స్టార్టప్ల కోసం వినియోగించవచ్చు కదా అని హితవు పలుకుతున్నారు. దేశీయ బ్యాంకులను కాదని, భారత స్టార్టప్లు విదేశీ బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటని నిలదీస్తున్నారు.