న్యూఢిల్లీ, జూలై 5: హంగేరికి చెందిన ప్రీమియం బైకుల తయారీ సంస్థ కీవే..దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టింది. కే-లైట్ 250 వీ మోటర్సైకిల్ మోడల్ను మంగళవారం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రారంభ ధర రూ.2.89 లక్షలు(ఎక్స్షోరూం)గా నిర్ణయించింది. 249 సీసీ సామర్థ్యంతో రూపొందించిన ఈ బైకును బుకింగ్ చేసుకున్నవారికి ఈ నెల చివరి నుంచి డెలివరీ చేయనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
మూడు రంగుల్లో లభించనున్న ఈబైకుల్లో బ్లూ కలర్ కలిగిన మోడల్ రూ.2.89 లక్షలకుగాను, డార్క్ గ్రే మోడల్ రూ.2.99 లక్షలు, బ్లాక్ మోడల్ రూ.3.09 లక్షలుగా ధరను నిర్ణయించింది. ఈ ధరలన్ని ఎక్స్షోరూం. ఈ సందర్భంగా కీవే ఇండియా ఎండీ వికాస్ ఝబాఖ్ మాట్లాడుతూ..ఈ ఏడాది చివరినాటికి మరో ఐదు బైకులను విడుదల చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. వీటిలో రెండు రెట్రో స్ట్రీట్ క్లాసిక్ కాగా, మరొకటి నాకెడ్ స్ట్రీట్, రేస్ బైకు అని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది చివరినాటికి ఈ బైకులను విక్రయించడానికి దేశవ్యాప్తంగా 100 అవుట్లెట్లను తెరవాలనుకుంటున్నట్లు తెలిపారు.