న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: భారతీయ నూతన విద్యుత్తు ఆధారిత వాహనాల విధానంపై గురువారం జరిగిన భాగస్వాముల సమావేశంలో టెస్లా సలహాదారు పాల్గొన్నారు. దేశంలో అమల్లోకి తేనున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) పాలసీకి సంబంధించి మార్గదర్శకాల కోసం ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాల నుంచి కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాలను తీసుకుంటున్నది. ఈ క్రమంలోనే ఆయా ఈవీల తయారీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతుండగా, టెస్లా తరఫున ఆ సంస్థ సలహాదారు (ది ఆసియా గ్రూప్) కూడా పాలుపంచుకున్నట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. భారత్లో పర్యటిస్తున్న క్రమంలో ఇది ప్రాధాన్యతను సంతరించుకున్నది. కాగా, వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీదారు విన్ఫాస్ట్ కూడా ఈ సమావేశానికి హాజరైంది. అలాగే మారుతీ సుజుకీ, హ్యుందా య్, టాటా మోటర్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, కియా, స్కోడా ఆటో, ఫోక్స్వాగన్, రెనాల్ట్, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడీ కంపెనీల ప్రతినిధులూ హాజరైనట్టు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ.. కొత్త ఈవీ పాలసీ వివరాలను ఆయా సంస్థల ప్రతినిధులకు తెలియపర్చింది. కాగా, ఈ నెల 22తో మొదలయ్యే వారంలో మస్క్, మరికొందరు టెస్లా ఉన్నతాధికారులు భారత్కు రానున్నారు.