EV Charging @ Substations | విద్యుత్ వాహనాలు వాడుతున్న వారికి గుడ్న్యూస్. తెలంగాణ రాష్ట్ర దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్), తెలంగాణ రాష్ట్ర సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్ఆర్ఈడీసీవో) కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సబ్స్టేషన్ల వద్ద విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నాయి. సరిపడా స్పేస్ గల సబ్స్టేషన్ల పరిధిలో చార్జింగ్స్టేషన్లను ఏర్పాటు చేయడానికి టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఆర్ఈడీసీవో ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటిని ఏర్పాటు చేయడానికి విధివిధానాలు ఇంకా ఖరారు చేయలేదు. కానీ విద్యుత్ వాహనాల దారుల నుంచి పెరుగుతున్న డిమాండ్ను అందుకునేలా చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఈ రెండు సంస్థల అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
సబ్స్టేషన్లలో సరిపడా స్థలం ఉండటంతోపాటు చార్జింగ్ స్టేషన్లకు విద్యుత్ సరఫరా చేయడానికి అవసరమైన మౌలిక వసతులు సిద్ధంగా ఉన్నాయి. అదనపు స్థలం ఉంటే.. ప్రత్యేకించి జాతీయ రహదారులపై గల సబ్ స్టేషన్ల వద్ద 20 వాహనాలకు ఒకేసారి చార్జింగ్ పెట్టొచ్చు. ఈ విషయమై టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఆర్ఈడీసీవో చర్చించినా.. బ్లూప్రింట్ సిద్ధం చేయలేదని అధికార వర్గాల కథనం.
గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పరిధిలో 415 సబ్స్టేషన్ల పరిధిలో అదనపు స్థలం ఉంది. దీన్ని చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి వాడుకోవచ్చు అని ఓ అధికారి చెప్పారు. కేంద్ర భారీ పరిశ్రమలశాఖ 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 68 నగరాల్లో 2,877 ఈ చార్జింగ్ స్టేషన్లను మంజూరు చేసింది.
ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ హైబ్రీడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండియా (ఫేమ్ ఇండియా)-2 దశ కార్యక్రమంలో భాగంగా తొమ్మిది ఎక్స్ప్రెస్వేలు, 16 జాతీయ రహదారులపై 1576 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈవీ చార్జింగ్ స్టేషన్ల వద్ద చార్జింగ్ మౌలిక వసతుల అభివృద్ధికి రూ.1000 కోట్లు కేటాయించారు. గత నెల 8 నాటికి తెలంగాణలో 136చార్జింగ్ స్టేషన్లు సేవలందిస్తున్నాయి.
జీహెచ్ఎంసీ, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఎలక్ట్రిక్ బైక్లు, ఎలక్ట్రిక్ కార్లతో కూడిన విద్యుత్ వాహనాలు 9000కి పైగా నడుస్తున్నాయి. విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్న మొదటి 10 రాష్ట్రాల్లో తెలంగాణ నిలిచింది. విద్యుత్ సబ్స్టేషన్ల వద్దే ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్న ప్తరిపాదన ఉందని టీఎస్ఆర్ఈడీసీవో ప్రాజెక్ట్ డైరెక్టర్ డీవీ రామకృష్ణ కుమార్ ధృవీకరించారు.