హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): సహకార రంగంలో తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) దేశానికే ఆదర్శంగా నిలిచింది. పలు విభాగాల్లో దేశంలోనే అత్యుత్తమ బ్యాంక్గా ఎంపికైంది. ఈ మేరకు ఉత్తమ సహకార బ్యాంక్ అవార్డును ప్రకటించిన రాష్ట్ర సహకార బ్యాంకుల జాతీయ సమాఖ్య (నాఫ్స్కాబ్).. మంగళవారం రాజస్థాన్ రాజధాని జైపూర్లో జరిగిన కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేసింది. ఈ అవార్డును టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, ఎండీ మురళీధర్ అందుకున్నారు. 2020-21, 2021-22 సంవత్సరాలకుగానూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు ప్రథమ, ద్వితీయ అవార్డులను అందుకున్నది. అలాగే దేశంలోని అన్ని రాష్ట్ర సహకార శిక్షణ సంస్థలలో టెస్కాబ్ సహకార శిక్షణ సంస్థ (సీటీఐ)కు 2020-21, 2021-22 సంవత్సరాలకుగాను ప్రథమ అవార్డు దక్కింది.
ఇక దేశంలోని 351 జిల్లా సహకార బ్యాంకుల్లో కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీబీ)కు 2020-21కిగాను ద్వితీయ, 2021-22కుగాను ప్రథమ అవార్డులను ప్రదానం చేశారు. బ్యాంక్ సీఈవో సత్యనారాయణ రావు తదితరులు అవార్డుల్ని తీసుకున్నారు. మరోవైపు దేశీయ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి 2021-22కుగాను సుభాష్ యాదవ్ అవార్డు కింద ప్రథమ బహుమతి దక్కింది. దీన్ని బ్యాంక్ చైర్మన్ మల్లారెడ్డి, కార్యదర్శి కళ్లెం తిరుపతిరెడ్డి తీసుకున్నారు. బ్యాంక్ కు జాతీయస్థాయి అవార్డులు రావడం వరుసగా ఇది మూడోసారి అని వారు వెల్లడించారు.