Air India to TATA | మహారాజా పుట్టింటికి చేరుకునే ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది. ఎయిర్ ఇండియాను టాటా సన్స్ తిరిగి టేకోవర్ చేయడానికి కౌంట్ డౌన్ మొదలైంది. 68 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి మహారాజాగా పేరొందిన ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరిండియా (ఏఐ) టేకోవర్ బిడ్ను టాటా సన్స్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.
ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్, ఏఐ సాట్స్ (టాటా సన్స్కు 50 శాతం వాటాలు)పై టాటా సన్స్ నియంత్రణ వచ్చే ఏడాది అంటే 2022 జనవరి 23 నుంచి మొదలు కానున్నది. గత నెలలోనే ఎయిరిండియా షేర్ల కొనుగోలు ఒప్పందంపై కేంద్రంతో టాటా సన్స్ సంతకాలు చేసింది.
ఫైలింగ్ రిపోర్ట్ సమయం వచ్చే వరకు ఎయిరిండియా యాజమాన్య హక్కుల బదిలీ కోసం వేచి చూస్తామని టాటా సన్స్ తెలిపింది. అయితే తమ ఆధీనంలోకి వచ్చాక ఎయిరిండియా నిర్వహణకు అనుసరించే వ్యూహాంపై టాటాలు పెదవి విప్పడం లేదు.
మెగా ఎయిర్లైన్గా నడుపుతారా.. లోకాస్ట్ విమానయాన సంస్థగా ఫుల్ సర్వీస్ క్యారియర్గా నడుపుతారా? అన్న విషయం తెలియడం లేదు. అలాగే మేనేజ్మెంట్ స్ట్రక్చర్, ఫ్లీట్ అండ్ క్యాబిన్ అప్గ్రేడ్ ప్లాన్స్ బయటకు రావడం లేదు. అయితే, కేంద్ర ప్రభుత్వ వర్గాలు మాత్రం ఈ ఏడాది చివరి నాటికి టాటా సన్స్కు ఎయిరిండియాను అప్పగించేందుకు ప్రయత్నిస్తామని చెప్పాయి.