Tata Tech IPO | టాటా సన్స్ అనుబంధ సంస్థ టాటా టెక్నాలజీస్ ఐపీవోలో సరికొత్త రికార్డు నమోదైంది. ఈ నెల 22 నుంచి 24 మధ్య నమోదైన సబ్ స్క్రిప్షన్లో టాటా టెక్నాలజీస్కు ఇన్వెస్టర్ల నుంచి భారీగా స్పందన లభించింది. గతేడాది నమోదైన ఎల్ఐసీ రికార్డు కూడా టాటా టెక్ తిరగ రాసింది. టాటా టెక్నాలజీస్ ఐపీఓలో రూ.3,043 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేస్తే 73.60 లక్షల బిడ్లు దాఖలయ్యాయి. దీనికి తోడు టాటా సన్స్ నుంచి 20 ఏండ్ల తర్వాత వచ్చిన ఐపీఓ కావడంతో ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన కనిపించింది. కాగా, టాటా టెక్ ఐపీఓలో షేర్ ఆఫర్ ధర రూ.500 గా ఖరారు చేసినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్లో దాని పేరెంట్ సంస్థ టాటా మోటార్స్ తెలిపింది. స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా పేరొందిన ఎల్ఐసీ ఐపీఓ ద్వారా రూ.20,557 కోట్ల నిధుల సమీకరణకు గరిష్టంగా 73.4 లక్షల దరఖాస్తులు దాఖలయ్యాయి.
టాటా టెక్నాలజీస్తోపాటు ఫ్లెయిర్ రైటింగ్, ఫెడ్ బ్యాక్ ఫైనాన్సియల్ సర్వీసెస్, గాంధార్ ఆయిల్ రిఫైనరీ, ఐఆర్ఈడీఏ ఐపీఓలు ముగిశాయి. ఈ ఐపీఓల్లో మొత్తం రూ.7,380 కోట్ల నిధుల సేకరణకు రూ.2.6 లక్షల కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి. వీటిల్లో టాటా టెక్ ఐపీఓకు 69.4 రెట్లు అధికంగా ఇన్వెస్టర్లు స్పందించారు.
కలాల తయారీ సంస్థ ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్ రూ.593 కోట్ల నిధుల సమీకరణ కోసం ఐపీవోకు రాగా 17 లక్షల బిడ్లతో 46.7 రెట్లు సబ్ స్క్రిప్షన్లు దాఖలయ్యాయి. గాంధార్ ఆయిల్ రిఫైనరీ ఐపీవో ఖింద 28.5 లక్షల అప్లికేషన్లతో 64.2 రెట్ల మంది ఇన్వెస్టర్లు స్పందించారు. రూ.2,150 కోట్ల నిధుల సేకరణ లక్ష్యంతో ఐఆర్ఈడీఏ ఐపీఓకు ఇన్వెస్టర్లు 38.8 రెట్లు ఎక్కువగా స్పందించారు. ఇక ఫెడరల్ బ్యాంక్ అనుబంధ ఫెడ్ బ్యాంక్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రూ.1,092 కోట్ల సమీకరణ లక్ష్యం పెట్టుకోగా 2.2 రెట్లు ఇన్వెస్టర్లు సబ్ స్క్రిప్షన్లు దాఖలు చేశారు.