న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రూ.9,598.16 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది టాటా స్టీల్ . క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.4,010.94 కోట్ల లాభంతో పోలిస్తే రెండింతలు అధికమైనట్లు వెల్లడించింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం భారీగా పెరగడం ఇందుకు కలిసొచ్చిందని పేర్కొంది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.42,152.87 కోట్ల నుంచి రూ.60,842.72 కోట్లకు ఎగబాకినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. నిర్వహణ ఖర్చులు రూ.36,492 కోట్ల నుంచి రూ.48,666 కోట్లకు చేరుకున్నాయి.
పెరిగిన ఉత్పత్తి
గడిచిన త్రైమాసికంలో క్రూడ్ స్టీల్ ఉత్పత్తి 7.76 మిలియన్ టన్నులకు పెరిగిందని తెలిపింది. ఏడాది క్రితం ఇది 7.74 మిలియన్ టన్నులుగా ఉన్నది. ఇదే త్రైమాసికంలో 7.01 మిలియన్ టన్నుల స్టీల్ విక్రయాలు జరిపింది. ఈ సందర్భంగా టాటా స్టీల్ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ మాట్లాడుతూ..కొవిడ్తో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుండటంతో స్టీల్కు డిమాండ్ అధికమవుతున్నదన్నారు. సెమికండక్టర్ల కొరతతో ఆటోమొబైల్ రంగంపై పడిన ప్రతికూల ప్రభావం స్టీల్ రంగంపై కూడా పడిందని ఆయన చెప్పారు.