TATA to Semi Conductors | కంప్యూటర్లు మొదలు టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీ మిషన్లు.. గ్యాడ్జెట్స్ అంటే మొబైల్ ఫోన్లు.. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు.. ఇక ఆటోమొబైల్స్లో టూ వీలర్స్ నుంచి కార్లు.. మల్టీ పర్పస్ వెహికల్స్.. ట్రక్కులు.. ట్రాక్టర్లు సర్వం టెక్నాలజీ మయం అయ్యాయి. టెక్నాలజీతో కూడిన గ్యాడ్జెట్స్, కార్లు.. టూ వీలర్స్.. ఇతర వెహికల్స్ నడవాలంటే సెమీ కండక్టర్లు అవసరం.. వీటి తయారీకి టాటా సన్స్ గ్రూప్ ముందుకొచ్చింది.
మూడు రాష్ట్రాల్లో చర్చిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఆ జాబితాలో ఉన్నాయి. 300 మిలియన్ డాలర్ల విలువ ఈ ప్రాజెక్టు కింద.. ఔట్ సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ (ఓఎస్ఏటీ) ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు టాటా సన్స్ సన్నద్ధం అవుతోంది. ఇప్పటికే టాటా సన్స్ సెమీ కండక్టర్ల తయారీ రంగంలో అడుగు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన స్థలం కేటాయించాలని రాష్ట్రాలను కోరినట్లు తెలుస్తున్నది.
సెమీకండెక్టర్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నట్లు కొన్నాళ్ల క్రితం టాటా ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే నెలలో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని టాటా సన్స్ గుర్తించనున్నదని విశ్వసనీయంగా తెలిసింది. ఫౌండ్రీల్లో తయారైన సిలికాన్ వైఫర్లను ఓఎస్ఏటీ ప్లాంట్లో అసెంబ్లింగ్, పరీక్షలు, ప్యాకింగ్ చేయడంతో అవి పూర్తి స్థాయి సెమీకండెక్టర్లుగా రూపుదిద్దుకుంటాయి.
ఇప్పటికే టాటా అనుబంధ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంస్థ.. సాఫ్ట్వేర్లో మార్కెట్ లీడర్గా కొనసాగుతున్నది. ఇక ఐటీ సేవల పోర్టోఫోలియోలో హార్డ్వేర్నూ జోడించాలని టాటా సన్స్ తహతహలాడుతున్నది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలపై టాటా సన్స్ అధికారికంగా స్పందించలేదు.
కరోనా నేపథ్యంలో సెమీ కండక్టర్లు తయారు చేసే కంపెనీలు మూతపడ్డాయి.. వర్క్ ఫ్రం హోం, లెర్నింగ్ ఫ్రం హోం సంస్కృతి అభివృద్ధి కావడంతో ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ పెరిగింది.
పర్సనల్ మొబిలిటీకి కూడా ఒక్కసారిగా ప్రాధాన్యం ఎక్కువైంది. కరోనా ఆంక్షలు ఎత్తేశాక ఫ్యాక్టరీలు తెరుచుకున్నా గిరాకీ.. డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి సాగడం లేదు. దీనికి తోడు బిట్ కాయిన్లు, ఇతర క్రిప్టో కరెన్సీల తయారీకి సెమీ కండక్టర్లు, చిప్లు వాడటంకూడా వాటి కొరతకు మరో కారణం.