హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): ఆటోమొబైల్ రంగంలో సరికొత్త ఆవిష్కరణలు చేసే స్టార్టప్లకు టీ-హబ్ అండగా నిలుస్తున్నది. ఇందులో భాగంగానే స్టార్టప్ల కోసం ఓ ఇన్నోవేషన్ చాలెంజ్ను తెచ్చేందుకు రెనాల్ట్ నిస్సాన్ టెక్నాలజీ అండ్ బిజినెస్ సెంటర్ ఇండియా (ఆర్ఎన్టీబీసీఐ)తో భాగస్వామ్యాన్ని ఏర్పర్చుకున్నట్టు మంగళవారం టీ-హబ్ తెలిపింది. ఈ చాలెంజ్లో గెలిచిన ఆయా స్టార్టప్లతో ఆర్ఎన్టీబీసీఐ కలిసి పనిచేయనున్నది. ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ, డిజిటైజేషన్, మొబిలిటి యాజ్ ఏ సర్వీస్ విత్ సోషల్ ఇంపాక్ట్, సర్క్యులర్ ఎకానమీ అనే నాలుగు థీమ్స్లో స్టార్టప్లు పాల్గొనాల్సి ఉంటుంది. ఒక్కో థీమ్ కోసం 6-8 స్టార్టప్లను ఎంపిక చేస్తారు. ఇందులో చివరకు నాలుగు స్టార్టప్లు రూ.10 లక్షల చొప్పున గెల్చుకోవచ్చు.
నేడు టీ-హబ్లో మెంటార్స్తో సమావేశం
వివిధ రంగాల్లో నిపుణుల్ని మార్గదర్శకులుగా ఎంపిక చేసి, వారితో స్టార్టప్ల వ్యవస్థాపకులు ముఖాముఖి సమావేశమయ్యేలా టీ-హబ్ చొరవ తీసుకుంటున్నది. వారి ఆలోచనలను తెలుసుకొని, దానికి అనుగుణంగా తమ వ్యాపార ప్రణాళికలను విస్తరించేందుకు స్టార్టప్లకు అవకాశాలు కల్పిస్తున్నది. ఈ క్రమంలోనే టీ-హబ్లో బుధవారం మెంటార్స్తో సమావేశం నిర్వహిస్తున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది.