న్యూఢిల్లీ : 2022 లేఆఫ్స్ సంవత్సరంగా నమోదయ్యే పరిస్ధితి నెలకొంది. పలు టెక్, ఇతర కంపెనీలు పెద్దసంఖ్యలో ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడుతుండటం, రాబడి పడిపోతుండటంతో కంపెనీలు వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా కొలువుల కోతకు దిగుతున్నాయి.
అమెజాన్ 20,000 మంది ఉద్యోగులను తొలగించనుండగా మెటా, ట్విట్టర్ సహా పలు కంపెనీలు వేలాది మంది ఉద్యోగులపై వేటు వేశాయి. తాజాగా స్విగ్గీ, వేదాంతు, అడోబ్ వంటి కంపెనీల్లోనూ లేఆఫ్స్ కలకలం రేగింది. అడోబ్ ఇటీవల తన సేల్స్ టీంలో పలువురిని విధుల నుంచి తప్పించగా స్విగ్గీ డిసెంబర్లో 250 మంది వరకూ ఉద్యోగులను సాగనంపేందుకు సన్నద్ధమైంది.
రాబోయే నెలల్లో మరింత మందిని తొలగిస్తామని ఫుడ్, గ్రాసరీ డెలివరీ కంపెనీ స్పష్టం చేసింది. లేఆఫ్స్ తప్పవనే సంకేతాలను స్విగ్గీ పంపింది. ఇక ఇప్పటికే 385 మంది ఉద్యోగులను వేదాంతు తొలగించింది. ప్రస్తుత వనరులతోనే లాభాలు ఆర్జించే క్రమంలో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఉద్యోగులను తొలగించామని ఎడ్యుటెక్ కంపెనీ పేర్కొంది. ఈ ఏడాది ఇప్పటివరకూ వేదాంతు 1100 మంది ఉద్యోగులను ఇంటికి పంపింది.