Swiggy | దేశంలోని ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ సంస్థ `స్విగ్గీ` కీలక నిర్ణయం తీసుకున్నది. సంస్థలోని మెజారిటీ ఉద్యోగులు శాశ్వతంగా ఎక్కడ నుంచైనా పని చేసే వీలు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. కార్పొరేట్, బిజినెస్, సెంట్రల్, టెక్నాలజీ విభాగాల ఉద్యోగులు తమకు నచ్చిన ప్రాంతాల నుంచి సేవలందించొచ్చునని శుక్రవారం వెల్లడించింది. పరస్పరం సంబంధాల కొనసాగింపు కోసం మూడు నెలలకోక సారి ప్రధాన కేంద్రంలో వారం రోజులు కలిసి ఉద్యోగులంతా పని చేస్తారని వివరించింది.
ఆయా విభాగాల్లో కలిసి పని చేయాల్సిన ఉద్యోగులు వారంలో కొన్ని రోజులు ఆఫీసుకు రావాల్సి ఉంటుందని స్విగ్గీ తెలిపింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో రెండేండ్లుగా వర్క్ ఫ్రం హోం అమలు చేయడం వల్ల మెరుగైన ఫలితాలు వచ్చాయని పేర్కొన్నది. సంస్థలోని వివిధ రంగాల మేనేజర్లు, ఉద్యోగుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపింది.
తమ ఉద్యోగుల అభిప్రాయాలతోపాటు అంతర్జాతీయంగా వివిధసంస్థల్లో కొనసాగుతున్న విధానానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని స్విగ్గీ హ్యుమన్ రీసోర్సెస్ విభాగం అధిపతి గిరీశ్ మేనన్ తెలిపారు. దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 487 నగరాల పరిధిలో స్విగ్గీలో 5000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 2020 నుంచి ఉద్యోగుల్లో ఫ్లెక్సిబుల్ వర్కింగ్ మోడల్ అమల్లోకి తెచ్చిన స్టార్టప్ సంస్థల్లో స్విగ్గీ ఒకటిగా నిలిచింది.