న్యూఢిల్లీ, నవంబర్ 11: ఉద్యాన పంటల కోసం స్వరాజ్ ట్రాక్టర్స్.. గురువారం ఓ సరికొత్త రైడింగ్ ట్రాక్టర్ను ఆవిష్కరించింది. ‘కోడ్’ పేరుతో 12 హెచ్పీ శ్రేణిలో ఈ బుల్లి వాహనాన్ని మార్కెట్కు పరిచయం చేశారు. ఈ పెట్రోల్ ఆధారిత వెహికిల్ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినట్లు ఈ సందర్భంగా స్వరాజ్ ట్రాక్టర్స్ సీఈవో హరీశ్ చవాన్ పీటీఐకి తెలిపారు. ఈ నెలాఖర్లో ధరను ప్రకటిస్తామన్న ఆయన.. తొలుత తెలంగాణ, ఏపీ, గుజరాత్, కర్నాటక రాష్ర్టాల మార్కెట్లకు అందుబాటులోకి తెస్తామని, దశలవారీగా అన్ని రాష్ర్టాల డీలర్లకు సరఫరా చేస్తామని చెప్పారు. హార్టికల్చర్ సాగులో తమ ఈ ఉత్పత్తి విప్లవాత్మక మార్పునే తేగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వివిధ రకాల కూరగాయలు, పండ్ల సాగులో ఈ ట్రాక్టర్ అత్యుత్తమ పనితీరును ప్రదర్శించగలదని, దీనివల్ల రైతులకు కూలీల ఖర్చు ఆదా అవుతుందని, పనిలో పశువుల వినియోగాన్నీ తగ్గించుకోవచ్చన్నారు.