IMF | భారత్ ఆర్థిక రంగ విజయంపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టాలినా జార్జివా సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నేండ్లుగా అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణల్లో భారత్ ఆర్థిక విజయం దాగి ఉందని చెప్పారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 2024 భారత్ జీడీపీ అంచనాలను ఐఎంఎఫ్ సవరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2024-25) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై స్పందిస్తూ ఆమె ఇలా వ్యాఖ్యానించారు.
‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకాశిస్తున్న భారత్.. ఇక ముందూ అలాగే కొనసాగుతుంది. 2024 భారత్ వృద్ధిరేటు అంచనాలను 6.5 శాతానికి పెంచుతున్నాం. 2023లో చాలా బలమైన పనితీరు కనబర్చినందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని క్రిస్టలీనా చెప్పారు. డిజిటలైజేషన్ వల్లే భారత్ తీసుకున్న నిర్ణయాలు చాలా ప్రయోజనాలు చేకూర్చాయని చెప్పారు. అదే ఇప్పుడు భారత్ ఆర్థిక వ్యవస్థకు బలమైన శక్తిగా మారిందన్నారు. చిరు వ్యాపారులు కూడా మార్కెట్లోకి ప్రవేశించడానికి డిజిటల్ వసతులు దోహద పడ్డాయని చెప్పారు. అయితే భారత శ్రామిక శక్తిలో ఇప్పటికీ మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉందన్నారు.