న్యూఢిల్లీ : కరోనా వైరస్ జాబ్ మార్కెట్పై పెను ప్రభావం చూపుతోంది. ఉద్యోగులు తమ ప్రాధాన్యతలను తిరిగి సమీక్షించుకుంటున్నారని, 71 శాతం మంది ఉద్యోగులు తమ కెరీర్లపై పునరాలోచన చేస్తున్నారని, విభిన్నమైన కెరీర్వైపు మళ్లుతున్నారని ఓ సర్వే నివేదిక స్పష్టం చేసింది. కొవిడ్-19 తాజా వేరియంట్లు, వేవ్లతో ప్రపంచవ్యాప్తంగా పలు ఆర్ధిక వ్యవస్ధలు కుదేలవుతుంటే ఈ మహమ్మారి కార్మిక మార్కెట్లలోనూ కల్లోలం రేపుతోంది. గ్లోబల్ జాబ్ సైట్ ఇండీడ్ సర్వే నివేదిక ఇదే ట్రెండ్ను కండ్ల ముందుంచుతోంది.
ఇండీడ్ సర్వేలో పాల్గొన్న వారిలో 71 శాతం మంది ఉద్యోగులు మెరుగైన ఇతర కెరీర్ను ఎంచుకునేందుకు మొగ్గుచూపారు. తాము ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం తమ ఉద్దేశాలను నెరవేరుస్తుందా అని 51 శాతం మంది ఉద్యోగులు యోచిస్తుండగా, తాము సరైన ఉద్యోగంలోనే ఉన్నామా అని 67 శాతం మంది తమను తాము ప్రశ్నించుకున్నారు. ఇక తమ జీవిత ప్రాధామ్యాలకు అనుగుణంగా ఉద్యోగ ప్రాధామ్యాలను మార్చుకుంటామని 61 శాతం మంది ఉద్యోగులు చెప్పుకొచ్చారు.
ఇక ప్రతి పది మందిలో ముగ్గురు తమ ప్రస్తుత ఉద్యోగాలను వదిలివేసేందుకు సిద్దపడ్డారని ఇండీడ్ ఇండియా హైరింగ్ ట్రాకర్ నివేదిక పేర్కొంది. ఈ తరహా ఆలోచన పురుష ఉద్యోగుల్లో 31 శాతంగా ఉండగా మహిళా ఉద్యోగుల్లో 19 శాతంగా ఉందని తెలిపింది. ఇక 49 శాతం మంది ఉద్యోగులు వారానికి ఐదు రోజుల పనిదినాలు కోరుకోగా 51 శాతం మంది రోజుకు 6-8 గంటల పనికి మొగ్గుచూపారు. మొత్తంమీద ఉద్యోగుల ఆలోచనా ధోరణిలో కొవిడ్-19 పెను మార్పులు తీసుకువచ్చిందని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.