ముంబై, ఆగస్టు 24: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు తోడు క్రూడాయిల్ తగ్గుముఖం పట్టినప్పటికీ మదుపర్లను అమ్మకాలవైపు నడిపించాయి. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటుండటం పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్ను నీరుగార్చిందని దలాల్స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే ట్రెండ్ను కొనసాగించాయి. ఇంట్రాడేలో 300 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరికి 171.72 పాయింట్ల నష్టంతో 77,369.11 వద్ద స్థిరపడింది.
మరో సూచీ నిఫ్టీ సైతం 32.95 పాయింట్లు కోల్పోయి 24,219.05 వద్ద నిలిచింది. సూచీల్లో అదానీపోర్ట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ట్రెంట్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, టీసీఎస్ షేర్లు నష్టపోగా..టాటా స్టీల్, హెచ్సీఎల్ టెక్నాలజీ, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యునిలీవర్ షేర్లు లాభాల్లో ముగిశాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర 1.68 శాతం తగ్గి 92.80 డాలర్లకు పడిపోయింది. ఆసియా మార్కెట్లు బలహీనంగా ట్రేడయ్యాయని, దీంతో బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికావడం సెంటిమెంట్ను నీరుగార్చిందని దలాల్స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.