న్యూఢిల్లీ, నవంబర్ 7: పండుగ సీజన్ సందర్భంగా పలు వినిమయ వస్తువులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఉత్పత్తిదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. వినియోగదారు కొనుగోలు చేసిన ఉత్పత్తిని కంపెనీ ఇన్స్టాల్ చేసిన తేదీ నుంచే వారెంటీ గడువు షెడ్యూల్ను ప్రారంభించాలని, కొన్న తేదీ నుంచి గ్యారెంటీని లెక్కించరాదని కేంద్ర వినియోగ వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్…సీఐఐ, ఫిక్కీ, అసోచామ్లతో సహా ఆరు వాణిజ్య చాంబర్లకు, పలు కన్జూమర్ గూడ్స్ కంపెనీలకు లేఖ రాశారు.
సామ్సంగ్, ఎల్జీ, పానాసోనిక్, బ్లూస్టార్, కెంట్, వర్ల్ఫూల్, వోల్టాస్, బాష్, హావెల్స్, ఫిలిప్స్, తోషిబా, సోనీ, హిటాచీ, ఐఎఫ్బీ, గోద్రేజ్, హెయర్, యూరేకా ఫోర్బ్స్, లాయిడ్ తదితర ఉత్పత్తిదార్లకు కేంద్ర కార్యదర్శి లేఖ రాస్తూ వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం వినియోగదారు ఉత్పత్తిని ఉపయోగించని సమయాన్ని వారెంటీ/గ్యారెంటీ పీరియడ్గా పరిగణించడం అనైతిక వ్యాపారమని తెలిపారు. ఈ మేరకు రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్లు, వాషింగ్ మెషిన్లు తదితర వైట్ గూడ్స్ తయారీ కంపెనీలు వాటి వారెంటీ/గ్యారెంటీ పాలసీని మార్చాలని ఆదేశించారు.