దేశ సార్వభౌమ పరపతిని దెబ్బతీసే పలు అంశాల్ని భారత్ ప్రస్తుతం ఎదుర్కొంటున్నదని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ హెచ్చరించింది. తాజాగా రేటింగ్ ఏజెన్సీ..‘ప్రపంచ పరిణామాల కారణంగా ఇండియా సావరిన్ రేటింగ్స్ను నిలుపుకుంటుందా’ అనే టైటిల్తో ఒక క్రెడిట్ ఎఫ్ఏక్యూను విడుదల చేసింది. భారత్ విదేశీ బ్యాలెన్స్ షీట్ పటిష్టంగా ఉన్నప్పటికీ, ఏడాదికాలంగా ఇతర సహ వర్థమాన మార్కెట్లు ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల నుంచి తప్పించుకోలేదని, దీంతో భారత్ సార్వభౌమ పరపతి రేటింగ్ తగ్గే ప్రమాదం ఉందని ఆ రిపోర్ట్లో హెచ్చరించింది.
– న్యూఢిల్లీ, అక్టోబర్ 12:
ప్రస్తుతం ఇండియాకు ఎస్ అండ్ పీ కనిష్ఠ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ రేటింగ్ అయిన ‘బీబీబీ-’ని కొనసాగిస్తున్నది. అంతర్జాతీయ సంక్షోభంతో భారత్ విదేశీ మారక నిల్వలు తగ్గుతున్నాయని, కరెంట్ ఖాతా లోటు పెరుగుతున్నదని, మరోవైపు గరిష్ఠస్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణాన్ని, దేశీయంగా, అంతర్జాతీయంగా కఠినతరమవుతున్న ద్రవ్య విధానాలను దేశం ఎదుర్కొంటున్నదని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ సావరిన్ అనలిస్ట్ ఆండ్రూ వుడ్ చెప్పారు. అధిక ద్రవ్యలోటును, రుణభారాన్ని భారత్ పటిష్ట ఆర్థిక వృద్ధి సమతౌల్యం చేస్తున్నదని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి రేటు గత ఏడాదితో పోలిస్తే 8.7 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గుతుందన్న అంచనాల్ని ఎస్ అండ్ పీ వెల్లడించింది. పరిస్థితులు తీవ్రతరమైతే తాము భారత్ సావరిన్ రేటింగ్ను తగ్గించాల్సి వస్తుందని వుడ్ తెలిపారు.
ప్రభుత్వ లోటు తగ్గకపోతే రేటింగ్ కట్
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మరింత బలహీనపడితే, 2023, 2024 సంవత్సరాల్లో భారత్ ఆర్థిక పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతుందని ఎస్ అండ్ పీ తెలిపింది. ప్రపంచ ద్రవ్య పరిస్థితులు కఠినంగా మారడం, అధిక ద్రవ్యోల్బణం ఎక్కువకాలం కొనసాగడం, దేశ విదేశాల్లో పెట్టుబడుల వాతావరణం దెబ్బతినడం, వినియోగ సెంటిమెంట్ బలహీనపడటం వంటి అంశాలు భారత్కు ప్రధాన రిస్క్లని రేటింగ్ ఏజెన్సీ అధికారి వివరించారు.
వాస్తవ జీడీపీ వృద్ధి రేటు క్రమేపీ తగ్గుతూ ఉంటే, ప్రత్యేకించి ప్రభుత్వ లోట్లు అదుపుచేయకపోతే సావరిన్ రేటింగ్ తగ్గవచ్చు. 2026 వరకూ భారత్ వృద్ధి రేటు 6.5-7.3 శాతం శ్రేణిలో ఉంటుందని ఎస్ అండ్ పీ అంచనా వేస్తున్నది. అంతర్జాతీయ ట్రెండ్తో భారత్లో వినియోగ ధరల ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు పెరుగుతున్నాయని, ఈ ట్రెండ్ 2023 మార్చి వరకూ కొనసాగుతుందన్నది. వచ్చే మార్చికల్లా ఆర్బీఐ పాలసీ రేటు 5.9 శాతానికి చేరుతుందని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు ద్రవ్యోల్బణం 6.8 శాతం మేర ఉంటుందని, 2023-24లో 5 శాతానికి, 2024-25లో 4.5 శాతానికి దిగివస్తుందన్నది.