హైదరాబాద్, మే 21(నమస్తే తెలంగాణ): ఏరోస్పేస్, డిఫెన్స్ రంగ విడిభాగాల తయారీలో డీఆర్డీవోతో భాగస్వామ్యం కలిగివున్న ఎస్కేఎం టెక్నాలజీస్ సంస్థ హైదరాబాద్లోని ఆదిభట్లలోని ఏరోస్పేస్ పార్క్లో శనివారం నూతన అత్యాధునిక కేంద్రాన్ని ప్రారంభించింది. మూడు ఎకరాల విస్తీర్ణంలో రూ.45 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జీ సతీశ్రెడ్డి ప్రారంభించినట్టు ఎస్కేఎం టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ సరిత రాతిబండ్ల వెల్లడించారు.
ఎస్కేఎం రాఫెల్, ప్రాట్ ఏఎంపీ, విట్నీ డెడియెన్ ఏరోస్పేస్, డస్సాల్ట్ ఏవియేషన్, మాజిలాన్ ఏరోస్పేస్ కార్పొరేషన్, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, డీఆర్డీవో, బీడీఎల్ తదితర ప్రఖ్యాత సంస్థలకు విడిభాగాలను సరఫరా చేసే ప్రపంచశ్రేణీ తయారీ సంస్థ ఎస్కేఎం టెక్నాలజీస్ అని చెప్పారు. గత ఏడాది రూ.తొమ్మిది కోట్ల టర్నోవర్ సాధించామని, ఈ ఏడాది రూ.30 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.