న్యూఢిల్లీ, డిసెంబర్ 4: వచ్చే ఏడాది బడ్జెట్లో కూడా మౌలిక సదుపాయాల కల్పనకు అధిక నిధుల కేటాయింపు జరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. హిందుస్థాన్టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ సందర్భంగా మంత్రి పలు అంశాల్ని ప్రస్తావించారు. క్రిప్టో విభాగంలో పరిణామాలపై జరుగుతున్న స్పెక్యులేషన్ ఆనారోగ్యకరమని, ఈ నేపథ్యంలో సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం ప్రభుత్వం క్రిప్టోకరెన్సీ బిల్లును తీసుకువస్తున్నదన్నారు. దేశంలో ముమ్మరంగా జరిగిన వ్యాక్సినేషన్ కారణంగా కరో నా ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం తక్కువగానే ఉం టుందని భావిస్తున్నామని, అ యినా జాగ్రత్తతో వ్యవహరించాలన్నారు. ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా కోలుకుంటున్నదన్న సంకేతాలు… గణాంకాల్లో కన్పిస్తున్నాయని, ప్రపంచంలో వేగంగా రికవరీ అవుతున్న ఆర్థిక వ్యవస్థ మనదేనన్నారు. ఈ సంవత్సరాంతానికి ఎయిర్ ఇండియా డిజిన్వెస్ట్మెంట్ పూర్తిచేసామన్నారు.